నేతల భేటీ: థర్డ్ ఫ్రంట్కు దేవెగౌడ సారథ్యం
న్యూఢిల్లీ: కాంగ్రెసు, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయదలచిన తృతీయ కూటమికి మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యం వహించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూడో కూటమి ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే క్రమంలో జెడి(యు), వామపక్షాలు, జెడి(ఎస్) నేతలు సోమవారం సమావేశమయ్యారు.
కాంగ్రెసేతర, బిజెపియేతర ప్రత్యామ్నాయానికి నిర్దిష్టమైన రూపం ఇచ్చేందుకు పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత 11 పార్టీల సమావేశాన్ని నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. జెడి(యు) నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సిపిఐ నేత ఎ.బి.బర్దన్, ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేవబ్రత బిశ్వాస్, జెడి(ఎస్) అధినేత హెచ్.డి.దేవెగౌడ తదితరులు ఇక్కడ భేటీ అయ్యారు. దేవెగౌడ తన నివాసంలో ఈ పార్టీల నేతలకు అల్పాహార విందు ఇచ్చారు.
ఈ సందర్భంగా తృతీయ ఫ్రంట్కు రూపం ఇచ్చే విషయంపై చర్చ సాగింది. 11 కాంగ్రెసేతర, బిజెపియేతర పార్టీలు అయిదు రోజుల క్రితం ఇక్కడ సమావేశమై పార్లమెంటులో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించిన విషయం తెలిసిందే. మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు క్రమంలో తొలి అడుగుగా ఈ సమావేశాన్ని భావిస్తున్నారు..
సోమవారం నాటి సమావేశానంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ విధానాలకు రూపకల్పన చేసేందుకు పార్లమెంటు సమావేశాల తరువాత 11 పార్టీలు ఢిల్లీలో భేటీ కావాలని ఈ రోజు నిర్ణయించినట్లు చెప్పారు. మూడో కూటమి ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి అనుసరించాల్సిన మార్గాలపై తాము చర్చించామని కారత్ తెలిపారు.
ఈ ప్రక్రియను ఎలా ముందుకు తీసికెళ్లడమనే అంశంపై తాము చర్చించామని, నితీశ్ కుమార్ ఢిల్లీలో ఉండటంతో ఆయనతో నేరుగా చర్చించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నామని, దీన్ని ఎలా ముందుకు తీసికెళ్లడమనే అంశంపై తాము కసరత్తు చేస్తున్నామని కారత్ చెప్పారు. కాంగ్రెసేతర, బిజెపియేతర పార్టీల సమావేశం జరిగిందని నితీశ్ కుమార్ సమావేశానంతరం మీడియాతో అన్నారు.
కొత్తగా ఏర్పడబోయే కూటమిని ఫస్ట్ ఫ్రంట్గా సిపిఎం నేత సీతారాం ఏచూరి అభివర్ణించారు. ప్రస్తుత భారాల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే ఆర్థిక విధానాలు, మతతత్వ శక్తుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే విధానాలను రూపొందించడం ఈ కొత్త కూటమి లక్ష్యమని ఆయన చెప్పారు.