దేవేగౌడ ఇంకెన్ని రోజులు బతుకుతారు..త్వరలోనే చచ్చిపోతారు..జేడీఎస్ ఖల్లాస్: బీజేపీ ఎమ్మెల్యే ఆడియో
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు ఆడియో టేపులు, ఆడియో క్లిప్పుల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ టేపులు, క్లిప్పుల వ్యవహారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాయకులకు ఉచ్చులా బిగుసుకుంటున్నాయి. వారి పాలిట ఉరితాళ్లవుతున్నాయి. ఆపరేషన్ కమల పేరుతో కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) ఎమ్మెల్యేలకు గాలం వేస్తూ ఆడియో టేపులతో సహా దొరికిపోయిన కర్ణాటక బీజేపీ నాయకుల నెత్తిన మరో పిడుగు పడింది. ఆడియో టేపుల వ్యవహారంలో పీకల్లోతు మునిగిపోయిన ఆ పార్టీని నిండా ముంచేసే మరో ఆడియో క్లిప్ తాజాగా వెలుగులోకి వచ్చింది.
దేవేగౌడకు రోజులు దగ్గర పడ్డాయి. ఆయన ఇంకెన్ని రోజులు బతుకుతారు. తొందర్లోనే చచ్చి పోతారు. ముఖ్యమంత్రి కుమారస్వామికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఎప్పుడూ అనారోగ్యం బారిన పడుతూనే ఉంటారు. వారిద్దరూ లేకపోతే జనతాదళ్ (ఎస్) పార్టీ గతేం అవుతుంది. జేడీఎస్ చరిత్ర ముగిసిపోతుంది. దాని కథ ఖల్లాస్ అవుతుంది.. అంటూ బీజేపీ శాసన సభ్యుడు ప్రీతమ్ గౌడ మాట్లాడినట్టుగా అనుమానిస్తోన్న ఆడియో క్లిప్ ఒకటి బుధవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. ఈ ఆడియో క్లిప్ బయటికి వచ్చిన వెంటనే జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. హసన్ లో ప్రీతమ్ గౌడపై దాడి చేశారు. ఆయన ఇంటిపై రాళ్లవర్షం కురిపించారు. రాళ్ల దాడిలో ప్రీతమ్ గౌడ గాయపడ్డారు. ఆయన ముఖం రక్తసిక్తమైంది.
ప్రీతమ్ గౌడ హసన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి, విజయం సాధించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఆపరేషన్ కమలలో భాగంగా.. జేడీఎస్ కు చెందిన గుర్మిట్ కల్ శాసన సభ్యుడు నాగన గౌడతో బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప పార్టీ ఫిరాయిస్తే, 50 కోట్ల రూపాయలను ఇస్తానంటే ఫోన్ లో మాట్లాడిన సంభాషణలు ఇటీవలే బహిర్గతమయ్యాయి. ఈ టేపులు అసెంబ్లీని కుదిపేస్తున్నాయి. అదే సమయంలో.. ప్రీతమ్ గౌడకు సంబంధించినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్పులు కూడా బయటికి రావడంతో.. బీజేపీ ఇక పూర్తిగా రక్షణాత్మక ధోరణిలో పడిపోయింది. గుర్మిట్ కల్ ఎమ్మెల్యేతో మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని యడ్యూరప్ప వివరణ ఇచ్చుకుంటున్నారు. తాజాగా, ప్రీతమ్ గౌడ క్లిప్ కూడా వెలుగులోకి రావడం బీజేపీకి విఘాతంలా మారింది.
ఓ న్యూస్ ఛానల్ ఈ ఆడియో క్లిప్పులను ప్రసారం చేసింది. ఆ వెంటనే జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహించారు. ప్రీతమ్ గౌడపై దాడి చేశారు. హసన్ విద్యానగర్ ప్రాంతంలోని ప్రీతమ్ గౌడ ఇంటి వద్ద బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. ఆయన బయటికి రావడంతో, రాళ్లు విసిరాు. రాళ్ల దాడిలో ప్రీతమ్ గౌడ కుండి కంటికి గాయమైంది. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి ఘటనపై ప్రీతమ్ గౌడ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. రాళ్లు విసిరిన వారిలో కొంతమందిని అదుపులోకి తీసుకన్నారు.