బీజేఎల్పీ నేతగా ఫడ్నవీస్.. రేపు శివసేన:..వారసుడికే అందలం?: తెగే దాకా లాగుతున్నట్టే
ముంబై: మహారాష్ట్ర భారతీయ జనతాపార్టీ శాసనసభా పక్ష (బీజేపీఎల్పీ) నేతగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఎన్నికయ్యారు. బీజేపీఎల్పీ నేతగా ఆయన ఎన్నిక కావడం వరుసగా ఇది రెండోసారి. మిత్రపక్షం శివసేనతో కలిసి అటు ముఖ్యమంత్రి పదవిని, ఇటు అధికారాన్ని పంచుకోవడానికి ఏ మాత్రం సుముఖంగా లేని దేవేంద్ర ఫడణవీస్ మరోసారి బీజేపీఎల్పీ నేతగా ఎన్నిక కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. బుధవారం ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోని కార్యాలయంలో బీజేపీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిశీలకులుగా కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు అవినాశ్ రాయ్ ఖన్నా ఈ సమావేశానికి హాజరయ్యారు. తొలుత నరేంద్ర సింగ్ తోమర్.. దేవేంద్ర ఫడణవీస్ పేరును బీజేపీఎల్పీ నాయకుడిగా ప్రతిపాదించారు. అనంతరం అవినాశ్ రాయ్ ఖన్నా దీన్ని బలపరిచారు. అనంతరం సభ్యులందరూ ఏకగ్రీవంగా ఫడణవీస్ సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం సభా నాయకుడిగా ఆయనే వ్యవహరిస్తోన్న విషయం తెలసిందే.
ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా చేయలేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే.. దేవేంద్ర ఫడణవీస్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమైంది. మిత్రపక్షం శివసేనతో పొరపచ్చాలొచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుందా? లేదా? అనేది ఉత్కంఠను రేపుతోంది. ప్రస్తుతం బీజేపీకి కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతును ఇస్తున్నారు. అయినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని అందుకోలేరు కమలనాథులు.
ఇదిలావుండగా.. శివసేన కూడా శాసనసభా పక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించబోతోంది. ఆదిత్య థాకరే శివసేన శాసనసభా పక్ష నేతగా ఎన్నిక కావడం దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. ఆదిత్య థాకరేను ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన తండ్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే.. బీజేపీని ఢీ కొడుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలనే ప్రతిపాదనను తీసుకొచ్చింది ఈ ఉద్దేశంతోనే. దీనికి బీజేపీ ససేమిరా అనడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్ఠంభన నెలకొంది.
అయిదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, 50-50 ఫార్ములాను అంగీకరించబోయేది లేదంటూ దేవేంద్ర ఫడణవీస్ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత మరింత బెడిసి కొట్టినట్టయింది. దీనికితోడు శివసేన సైతం బీజేపీపై ఘాటు విమర్శలు చేస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీలు తమ మధ్య బంధాన్ని తెగే దాకా లాగుతున్నట్టే కనిపిస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా- ాదిత్య థాకరే శివసేన సభా పక్ష నాయకుడిగా ఎన్నిక కావడమంటూ జరిగితే.. ఆయనను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తున్నట్టే. దీనికోసం శివసేన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్-ఎన్సీపీల మీద ఆధారపడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.