అనూహ్యం: దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా: 50-50 ఫార్ములాలో భాగమేనా?
ముంబై: మహారాష్ట్రలో హైడ్రామా చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణమం తెర మీదికి వచ్చింది. ఎవ్వరూ ఊహించని పరిణమాం అది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఆయన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి అందజేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయనకు అందజేశారు. ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఎన్నికల ఫలితాలు వెలువడి 15 రోజుల తరువాత కూడా మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు కాలేదు. మిత్రపక్షమైన శివసేన 50-50 ఫార్ములాను తెర మీదికి తీసుకుని రావడం, రోజులు గడుస్తున్నప్పటికీ.. దానికే కట్టుబడి ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్ఠంభన నెలకొన్న విషయం తెలిసిందే. ప్రతిష్ఠంభనను తొలగించడానికి భారతీయ జనతాపార్టీ పలు చర్యలు తీసుకున్నప్పటికీ.. శివసేన మెత్త బడలేదు. మెట్టు దిగలేదు.
ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవాలనే నిబంధనకు కట్టుబడి ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటులోొ పీటముడి పడింది. చివరికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు దారి తీసింది. దీన్ని బట్టి చూస్తోంటే.. శివసేన ప్రతిపాదించిన 50-50 ఫార్ములాకు బీజేపీ అంగీకరించిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని అటు బీజేపీ, ఇటు శివసేన నాయకులు ఆఫ్ ది రికార్డుగా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
చెరో రెండున్నరేళ్ల కాలం పాటు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలనే నిబంధన మేరకు తొలి విడతగా శివసేనకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడానికి వీలు కల్పిస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తొలి రెండున్నరేళ్ల కాలాన్ని శివసేన నాయకుడికి అప్పగించి, మలి రెండున్నరేళ్ల కాలాన్ని బీజేపీ పంచుకోవాలనే ప్రతిపాదన రావడం వల్లే దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారని చెబుతున్నారు.