"మహారాష్ట్ర సీఎంకు మహా షార్ట్ టెంపర్.. కోపమొస్తే అంతే.."
ముంబై : రొటీన్ విమర్శలతో ప్రభుత్వాలను టార్గెట్ ను చేయడం కామన్. రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని.. అభివృద్దిపై ఫోకస్ చేయడం లేదని.. ఇలా రకరకాలుగా. అయితే ఇలాంటి విమర్శలతో కాకుండా.. వ్యక్తిత్వాన్ని టార్గెట్ ను చేస్తూ.. సీఎం ఇమేజ్ కు ఎసరుపెట్టే పనిచేశారు నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తనయ సుప్రియా సూలే. మహారాష్ట్ర సీఎం కు 'షార్ట్ టెంపర్' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర అంతటా హాట్ టాపిక్ గా మారాయి.
ఇంతకీ సుప్రియా సూలే ఏమన్నారంటే.. 'సీఎంకు మహా షార్ట్ టెంపర్. అసలెవరి మాట వినరు, చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తారు.. ఒకవిధంగా ఆయన కోపం నీళ్ల కుళాయిల వద్ద మహిళలు పోట్లాడుకున్నట్టే ఉంటుంది.. అందుకే ఆయన వద్దకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా హెల్మెట్ పెట్టుకునే వెళ్తా..' అంటూ మహారాష్ట్ర సీఎంపై విమర్శలు గుప్పించారు సుప్రియా సూలే.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలను ఉద్దేశిస్తూ.. పూణేలో జరిగిన ఓ సమావేశంలో గురువారం నాడు సూలే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై సీఎం ఫడ్నవీస్ సర్కార్ ను నిలదీసే ప్రయత్నం చేస్తోంది నేషనల్ కాంగ్రెస్. ఇందుకోసం పంట నష్టపోయిన రైతులందరిని సమీకరించి వారికి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
కరువు వల్ల పంట దెబ్బ తిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే కరువు పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలను కరువు జిల్లాలుగా ప్రకటించాలని సుప్రియా సూలే డిమాండ్ చేస్తున్నారు.