సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం: అద్వానీ, బాబు హాజరు
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. వాంఖేడే స్టేడియంలో గవర్నర్ విద్యాసాగర రావు ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, కేంద్రమంత్రులు, బీజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రమణ్ సింగ్, వసుందర రాజే, మనోహర్ పారికర్, పలువురు పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, ఆది గోద్రే తదితరులు, సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ తదితరులు హాజరయ్యారు. మోడీ, అద్వానీలు వేదిక పైన ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.
ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గవర్నర్ వరుసగా మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించారు. సుధీర్ సచ్చిదానంద, మంచుభాయి మొహతా, చంద్రకాంత్ పాటిల్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఫడ్నవిస్ బీజేపీ మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి.
గోపినాథ్ ముండే కూతురుకు మంత్రి పదవి
స్వర్గీయ గోపినాథ్ ముండే కూతురు పంకజ్ ముండేకు ఫడ్నవీస్ కేబినెట్లో చోటు దక్కింది. ఆమె శుక్రవార ం సాయంత్రం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏకనాథ్ ఖడ్సేకు కూడా మంత్రి పదవి దక్కింది. కాగా వీరు, ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.