హరహర మహదేవ్: ఫలితాల ముందు రోజు మహా ముఖ్యమంత్రి ఎక్కడున్నారో తెలుసా?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడానికి ఒక రోజు ముందు..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్ లో పర్యటించారు. మహిమాన్వితమైన కేదార్ నాథ్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. తన భార్య అమృత ఫడణవీస్ తో కలిసి కేదార్ నాథుణ్ని దర్శించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. హర హర మహదేవ్.. అంటూ నినదించారు. మహారాష్ట్రలో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో.. దీనికి అనుగుణంగానే ఎన్నికల ఫలితాలు ఉంటాయని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు.
మోడీ బాటలో ఫడణవీస్
ఇదివరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా లోక్ సభ ఎన్నికల ఫలితాలకు వెల్లడి కావడానికి ముందు.. కేదారేశ్వరుడిని సందర్శించిన విషయం తెలిసిందే. తాజాగా- దేవేంద్ర ఫడణవీస్ కూడా అదే బాటలో నడిచినట్టయింది. గురువారం ఉదయం నుంచి వెలువడుతున్న ప్రారంభ ఫలితాలను బట్టి చూస్తోంటే.. దేవేంద్ర ఫడణవీస్ వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చూయడం ఖాయంగా కనిపిస్తోంది. నాగ్ పూర్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన లీడింగ్ లో కొనసాగుతున్నారు.
నివాసం నుంచే ఫలితాలు పర్యవేక్షణ
ప్రస్తుతం దేవేంద్ర ఫడణవీస్ ముంబైలోని తన అధికారిక నివాసం నుంచే ఎన్నికల ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్నారు. ఆరంభంలో ఫలితాలన్నీ బీజేపీ-శివసేన కూటమి వైపే మొగ్గు చూపిన నేపథ్యంలో ఆయన నివాసానికి సందర్శకుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు ఫడణవీస్ నివాసానికి వెళ్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, ఫడణవీస్ అనుచరులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకుంటున్నారు. డప్పులు, మేళతాలాలతో సందడి చేస్తున్నారు. కాషాయరంగులను చల్లుకుంటున్నారు.