దారులన్నీ అటువైపే..! కుంభమేళాకు పోటెత్తిన జనం
అలహాబాద్ : కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశవిదేశాల నుంచి ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) కు క్యూ కడుతున్నారు. పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం ఒక్కరోజే దాదాపు 70 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. కుంభమేళాలో పవిత్రస్నానాలు చేయడానికి దీన్ని ముఖ్యమైన రోజుగా భావిస్తారు చాలామంది. దీంతో చలిని సైతం లెక్కచేయకుండా... ఆదివారం రాత్రి నుంచే గంగానది దగ్గర భక్తుల కోలాహలం కనిపించింది.
సూర్యోదయానికి ముందే చాలామంది పుణ్యస్నానాలు ముగించుకున్నారు. వేకువజామున చంద్రుడు పూర్ణాకృతిలో దర్శనమివ్వడంతో భక్తులకు కనువిందు చేసినట్లైంది. మైక్ సెట్లలో వినిపించిన డివొషనల్ సాంగ్స్ సందర్శకులను మరింత ఉత్తేజపరిచాయి. కుంభమేళాలో పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. కల్పవాస్ ప్రారంభానికి ప్రతీకగా దీన్ని పరిగణించడంతో భక్తులు పవిత్ర దినంగా భావిస్తారు.
ఈ ఏడాది దాదాపు 15 కోట్ల మంది వరకు కుంభమేళాకు వస్తారనే అంచనాతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. తాత్కాలిక టెంట్ సిటీ (గుడారాలు) వేసి సౌకర్యాలు కల్పించింది.