లోకసభ ఎన్నికల్లో దేవయాని తండ్రి ఉత్తమ్ పోటీ
ముంబై: దౌత్యవేత్త దేవయానికి కోబ్రాగాదే తండ్రి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఉత్తమ్ కోబ్రాగాదే వచ్చే ఎన్నికల్లో లోకసభకు పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారంనాడు చెప్పారు. తాను పదవీ విరమణ చేసినప్పటి నుంచి తాను రాజకీయాల్లోకి వస్తాననే ఊహాగానాలు చెలరేగుతున్నాయని ఆయన పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు.
రాజకీయాల్లోకి రావడం గురించిన విషయం కొత్తదేమీ కాదని, సర్వీసు నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆ ఊహాగానాలు చెలరేగుతున్నాయని, తాను లోకసభకు పోటీ చేస్తానని ఆయన చెప్పారు. అయితే, తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని ఆయన వెల్లడించడానికి నిరాకరించారు.
వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, తగిన సమయంలో దాని గురించి ప్రకటన చేస్తానని ఉత్తమ్ చెప్పారు. దేవయాని ఇద్దరు పిల్లలు వచ్చే నెలలో భారతదేశానికి తిరిగి వస్తారని ఆయన చెప్పారు.
దేవయాని పిల్లలు విద్యను కొనసాగించాల్సి ఉంటుందని, అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వారిని చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.