ఎయిర్పోర్టు రన్వేపై పందుల గుంపు హల్చల్!
న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ నాగపూర్ విమానాశ్రయంలో ఒక్కసారిగా వచ్చిన పందుల గుంపు రన్ వేపై హల్చల్ చేశాయి. పటిష్టమైన రక్షణ కవచాన్ని ఛేదించుకుని కొన్ని పందులు రన్ వేపైకి వచ్చి, విమానాశ్రయ సిబ్బందికి చెమటలు పట్టించాయి.
సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అయిన సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం కావడం గమనార్హం. కాగా, ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది.
రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం నాగపూర్కు వచ్చారు. రాష్ట్రపతి ప్రయాణిస్తున్న జంబో బోయింగ్ 737 విమానం నాగపూర్ విమానంలో కిందకు దిగి టెర్మినల్ బిల్డింగ్ వైపు వెళుతుండగా రన్ వేపై హఠాత్తుగా 8 పందులు గంపుగా వచ్చాయి.
వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది ఉరుకులు పెట్టి పందుల గుంపును రన్ వే నుంచి వెళ్లగొట్టారు. ఎయిర్ పోర్టులోకి పందుల చొరబాటును సీరియస్గా పరిగణించి డీజీసీఏ విచారణ ప్రారంభించింది. దర్యాప్తు అనంతరం బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.