ధనుష్కు షాక్.. కదిరేషన్ దంపతులకు ఊరట.. ఆ సర్టిఫికెట్స్ సమర్పించాలన్న హైకోర్టు
తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్కు మధురై కోర్టు షాకిచ్చింది. ధనుష్ తల్లిదండ్రులను తామే అంటూ కదిరేషన్-మీనాక్షి దంపతులు దాఖలు చేసిన పిటిషన్పై శనివారం విచారణ జరిపింది. జనన,విద్య,ఇంటి ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సిందిగా ధనుష్ను ఆదేశించింది. ఇప్పటికే పలుమార్లు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని కోర్టు ఆదేశించినా ధనుష్ మాత్రం పత్రాలు సమర్పించలేదు. ఈ నేపథ్యంలో 15 రోజుల్లోగా కోర్టుకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని చెన్నై కార్పోరేషన్కు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న కదిరేషన్ దంపతులకు ఇది కాస్త ఊరట కలిగించే అంశం.
గతంలో కింది కోర్టు ధనుష్కి తీర్పునివ్వడంతో కదిరేషన్ దంపతులు మధురై హైకోర్టును ఆశ్రయించారు. మూడేళ్లుగా కేసులో పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. జనన,విద్య,స్థల ధ్రువీకరణ పత్రాలను ఇంతవరకు ఎందుకు సమర్పించలేదని ధనుష్ తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ విషయంలో చెన్నై కార్పోరేషన్ కల్పించుకుని ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఆదేశించింది.
కాగా,గతంలో ధనుష్కు సంబంధించి కదిరేషన్ దంపతులు కోర్టులో టీసీని సమర్పించారు. అయితే ధనుష్ తరుపు న్యాయవాది సమర్పించిన టీసీలో ధనుష్ ఒంటిపై పుట్టుమచ్చలు లేవని పేర్కొన్నారు. దీంతో మధురై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించి కోర్టుకు నివేదిక అందజేశారు. ఆ నివేదికలో ధనుష్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా పుట్టుమచ్చలు తొలగించుకున్నాడని తేలింది. అప్పటినుంచి కోర్టులో కేసు పురోగతి లేకుండా వాయిదాలు పడుతూనే ఉంది. ధనుష్కు డీఎన్ఏ పరీక్ష చేస్తే అసలు నిజం తెలుస్తుందని కదిరేషన్ దంపతులు అంటున్నారు. మరోవైపు ధనుష్ తరుపు న్యాయవాది మాత్రం ఆ వృద్ద దంపతులు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.