షిర్డీ సాయి విగ్రహాల్ని తొలగించాలి: ధర్మసంసద్, పీకే చిత్రంపై భగ్గు..
వారణాసి: హిందూ మత గరువులు, సాధువులు పలువురు పీకే చిత్రం పైన మండిపడుతున్నారు. అలాగే షిర్డీ సాయిబాబా విగ్రహాల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా దేవాలయాల నుంచి షిర్డీ సాయి విగ్రహాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా, వివాదాస్పద అమీర్ ఖాన్ నటించిన చిత్రం పీకే పైన నిషేధం విధించాలని ధర్మ సంసద్ డిమాండ్ చేసింది. హిందూమత మనోభావాలను గాయపరిచిన పీకే చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చి ప్రదర్శనకు అనుమతి ఇచ్చిన బోర్డు సభ్యులపై చర్య తీసుకోవాలని కోరింది.
ద్వారకా పీఠం శంకరాచార్య స్వరూపానంద సరస్వతి, పూరీ పీఠం శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతిల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అలహాబాద్లో జరిగిన ధర్మ సంసద్ భేటీ ఈ మేరకు పలు తీర్మానాలు ఆమోదించింది.
సాయిబాబా గురువు కాదని అలాగే దేవుడు కాదని తీర్మానం చేశారు. హిందూ దేవాలయాల్లో షిర్డీ సాయిబాబా విగ్రహాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పీకే చిత్రం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని, దానిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పథకాల పేర్లు హిందీలో ఉండాలని, అయోధ్యలో రామాలయం నిర్మించాలని తీర్మానం చేశారు.