కేంద్రమంత్రి ప్రధాన్ స్వచ్ఛభారత్: కోహ్లీ, రోహిత్, సైనా నామినేట్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రముఖ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్శర్మ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సహా తొమ్మిది మంది ప్రముఖులను నామినేట్చేశారు.
స్వతహాగా మీడియాకు దూరంగా ఉండే ఆయన ఆదివారం ఢిల్లీలోని యూసుఫ్ సరాయి ప్రాంతంలో జరిగిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో చీపురు పట్టి వీధులు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కోహ్లీ, రోహిత్, సైనాలతోపాటు బిలియర్డ్స్ ఆటగాడు పంకజ్ అద్వానీ, టెన్నిస్ స్టార్ మహేశ్భూపతి, ఒడియా సినీ నటులు అపరాజిత మహంతి, ఎంపీ సిద్ధాంత్ మహాపాత్ర, ప్రతిభావంతులైన పేదవిద్యార్థుల కోసం ఫ్రీ ఐఐటీ కోచింగ్ కేంద్రం సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్కుమార్లనూ మంత్రి ధర్మేంద్రప్రధాన్ నామినేట్చేశారు.
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గత అక్టోబర్ రెండో తేదీన ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి పలువురు ప్రముఖులు భాగస్వాములు అయ్యారని ఆయన గుర్తుచేశారు.
తన వంతు కర్తవ్యంగా వీధులను పరిశుభ్రంచేశానని తెలిపారు. కానీ, తాను ప్రచారం కోరుకోవడం లేదు అని పేర్కొన్నారు. తాను నామినేట్ చేసిన ప్రముఖులు ఒక్కొక్కరు మరో తొమ్మిది మందిని స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.