తమిళనాడులో మరో కొత్త పార్టీ, మన్నార్ గుడి ఫ్యామిలీలో చిచ్చు, అపోలోలో సీఎం కావాలని!
చెన్నై: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ తెర మీదకు వచ్చింది. శశికళ మన్నార్ గుడి మాఫియా ఫ్యామిలీలో చిచ్చు రేగడంతో అమ్మ మక్కల్ మన్నేట్ర కళగం పార్టీ వ్యవస్థానకుడు, ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కు పోటీగా అతని మేనమామ, శశికళ సోదరుడు దివాకరన్ అమ్మ మణి అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. అమ్మ మరణించిన రోజు అపోలో ఆసుపత్రిలోనే సీఎం కావాలని టీటీవీ దినకరన్ పావులుకదిపాడని దివాకరన్ బాంబు పేల్చాడు.
పదవులు ఇస్తే భయం
ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీలో శశికళ కుటుంబ సభ్యులు ఎవ్వరికీ పదవులు లేవు. శశికళ కుటుంబ సభ్యులకు పదవులు ఇస్తే తనను రాజకీయంగా తొక్కేస్తారని టీటీవీ దినకరన్ ఆందోళన చెందుతున్నాడు.
మాటల యుధ్దం
టీటీవీ దినకరన్ పార్టీలో శశికళ కుటుంబ సభ్యులు ఎవ్వరికీ పదవులు రాకపోవడంతో మన్నార్ గుడి మాఫియా ఫ్యామిలీలో మాటల యుధ్దం మొదలైయ్యింది. ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్, శశికళ సోదరుడు దివాకరన్ నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అంటూ విమర్శలు చేసుకుంటున్నారు.
అమ్మ వర్గం అంటూ ప్రచారం
టీటీవీ దినకరన్ పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు పోటీగా అతని మేనమామ అమ్మ మణి పార్టీ స్థాపించారు. జయలలిత వర్గం అనే అర్థం వచ్చేలా దివాకరన్ తన కొత్త పార్టీ పేరు అమ్మ మణి అని పెట్టుకున్నాడు. టీటీవీ దినకరన్ వర్గంతో తాము కలిసి పని చెయ్యమని దివాకరన్ తేల్చి చెప్పాడు.
రాష్ట్రంలో కమిటీలు
అమ్మ అణి పార్టీకి తమిళనాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ పదవులకు నాయకులను నియమిస్తామని మన్నార్ గుడిలో దివాకరన్ ప్రకటించారు. రాష్ట్ర, జిల్లా కమిటీలను అతి త్వరలో ప్రకటించి తరువాత సభలు, సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తామని దివాకరన్ ప్రకటించారు.
సీఎం కావాలని అపోలోలో స్కెచ్
2016 డిసెంబర్ 5వ తేదీన జయలలిత మరణించిన వెంటనే టీటీవీ దినకరన్ తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని అపోలో ఆసుపత్రిలోనే పావులు కదిపాడని దివాకరన్ ఆరోపించారు. ఆ సమయంలో తాము టీటీవీ దినకరన్ ను అడ్డుకుని పన్నీర్ సెల్వంను సీఎం చేశామని దివాకరన్ అన్నాడు. సీఎం చెయ్యలేదని కోపంతో టీటీవీ దినకరన్ మామీద కక్షకట్టాడని దివాకరన్ ఆరోపించారు.