ధోని సడన్ రిటైర్మెంట్ వెనుక కారణం ఏమై ఉంటుంది?
న్యూఢిల్లీ: టీమిండియాకు అనేక అద్భుతమైన విజయాలు అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అలాంటి మహేంద్ర సింగ్ ధోని హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాలు ఏమైఉంటుందనేది క్రికెట్ అభిమానులందరినీ తొలుస్తున్న ప్రశ్న. సాధారణంగా టాప్ ఆటగాళ్లుగా పేరొందిన క్రికెటర్లు ఫామ్ లేకపోవడం, గాయాలు, వయసు పెరగడం లాంటి విషయాల కారణంగా రిటైర్మెంట్ ప్రకటిస్తారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
ఐతే, ధోని విషయంలో అలాంటివి ఏమీ లేకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. టెస్టు క్రికెట్ నుంచి ధోని రిటైర్మెంట్ నిర్ణయం ఒకందుకు మంచిదైతే మరొకందుకు నష్టం కలిగించేదిగా ఉంది. ముఖ్యంగా ధోని లాంటి సీనియర్ ఆటగాడు లేకుండా టీమిండియా టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉండగా, ధోని స్ధానంలో మరో యువ క్రికెటర్కు స్ధానం దక్కనుంది.
హఠాత్తుగా ధోని టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాలను విశ్లేషిస్తే... రెండు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ధోని సేన విదేశాల్లో కేవలం కాగితం పులులనే పేరును నిలబెట్టుకుంటా వరుసగా విఫలమవుతుండటం ఒకటి కాగా, మరొకటి ధోని వరుసగా సెలవులు తీసుకోవడం.
కెప్టెన్గా బాధ్యతలను పక్కనబెట్టి సెలవులు కావాలని అడగటం ఎంతవరకు సమంజసం మంటూ బీసీసీఐ మాజీలు నిలదీస్తున్నారంట. దీంతో గవాస్కర్, గంగూలీ, మంజ్రేకర్ వంటి సీనియర్లు ధోనీకి రిటైర్మెంట్ సలహా ఇచ్చారు. ధోనీ రిటైర్ అయితే జూనియర్లకు అవకాశం వస్తుందని వారు స్పష్టం చేశారని తెలుస్తోంది.
గత రెండేళ్ల కిందటే ధోని తన రిటైర్మెంట్ విషయం గురించి ప్రస్తావించాడు. వచ్చే ప్రపంచ కప్(2015 వన్డే కప్) నాటికి తన వయసు 34 ఏళ్లు ఉంటాయని, జట్టుకు సారథ్యం వహించాలంటే ఫిట్ నెస్ కాపాడుకోవాల్సిన అవసరముందని ధోని గతంలో వ్యాఖ్యానించాడు. ప్రపంచ కప్, వన్డేలపై పూర్తిగా దృష్టిసారించాలంటే టెస్టుల నుంచి వైదొలగకతప్పదని కూడా అప్పట్లో చెప్పాడు.
వచ్చే ఏడాది వరల్డ్ కప్ సమీపిస్తుండటంతో ముందు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి, ఆ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తే సరిపోతుందని ధోని ఆలోచనగా కనిపిస్తోంది. అన్నింటిని దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రీడా నిపుణులు భావిస్తున్నారు.
కెప్టెన్ ధోని తీసుకున్న నిర్ణయాన్ని బీసీసీఐ సమర్థించింది. పరిమిత ఓవర్ల క్రికెట్పై పూర్తిగా దృష్టిసారించేందుకు ధోనీ రిటైరయ్యారని బీసీసీఐ ప్రకటించింది. ధోనీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు బీసీసీఐ పేర్కొంది. 2004లో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించిన మహేంద్ర ధోనీ... 2005లో ధోనీ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు.
శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడాడు. ధోనీ తన కెరీర్లో 90 టెస్టులు ఆడాడు. 38.09 సగటుతో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ధోనీ అత్యుత్తమ స్కోరు 224. ఆస్ట్రేలియాతో ఈ రోజు ముగిసిన మూడో టెస్టే ధోనీకి ఆఖరి మ్యాచ్.