ధోనీ సెకండ్ ఇన్నింగ్స్: ఎంటర్టెయిన్మెంట్ రంగంలోకి జార్ఖండ్ డైనమైట్, తీయబోయే వెబ్సిరీస్ ఇదే..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్కు గుడ్బై చెప్పిన తర్వాత మరో రంగం వైపు దృష్టి పెట్టారా..? ఇప్పటికే పలు వ్యాపారాలను నిర్వహిస్తున్న ఈ జార్ఖండ్ డైనమైట్ సినిమా రంగం వైపు చూస్తున్నాడా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఆగష్టు 15న తన అంతర్జాతీయ క్రికెట్నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్ను షాక్కు గురిచేసిన ఈ ధోనీ.. అదే అభిమానులకు మరో స్వీట్ న్యూస్ చెప్పాడు.
ఎంటర్టెయిన్మెంట్ రంగంలోకి ధోనీ
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పేసిన ధోనీ రెండో ఇన్నింగ్స్లో భాగంగా త్వరలోనే ఎంటర్టెయిన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. 2019లో ధోనీ ఎంటర్టెయిన్మెంట్ పేరుతో బ్యానర్ మొదలు పెట్టిన ఈ రాంచీ సూపర్ స్టార్... వచ్చే ఏడాది పలు ప్రాజెక్టులను చేపట్టబోతున్నట్లు సమాచారం. ఈ ప్రొడక్షన్ హౌజ్కు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తోన్న సాక్షి ధోనీ దీనికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ట్విటర్ వేదికగా పోస్టు చేశారు.
ఇదే ఆ వెబ్ సిరీస్
తొలిసారిగా రచయితగా మారబోతున్న ఓ వ్యక్తి రాసి ఇంకా ప్రచురణ కానీ ఓ పుస్తకంకు సంబంధించి హక్కులను కొనుగోలు చేసినట్లు సాక్షి ధోనీ చెప్పారు. త్వరలోనే దాన్ని వెబ్సిరీస్గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు. ఈ స్టోరీ ఒక అఘోరాకు సంబంధించిందని మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్గా తెరకెక్కిస్తామని సాక్షి ధోనీ చెప్పారు. ఈ కథను మొత్తం సుదూరంగా ఉన్న ఒక దీవిలో షూట్ చేస్తామని సాక్షి ధోని చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూను ఫైనలైజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే ధోనీ మొదటి ఓటు క్రికెట్కే అని చెప్పిన సాక్షి... ఇక నుంచి ప్రొడక్షన్ హౌజ్కు సంబంధించిన కార్యకలాపాలపై కూడా దృష్టి సారిస్తారని వివరించారు.
కొత్త టాలెంట్కు వేదిక
"రోర్ ఆఫ్ ది లైన్" డాక్యుమెంటరీ చిత్రం చేసే సమయంలోనే సమయంలో ఎంటర్టెయిన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టాలని భావించినట్లు సాక్షి ధోనీ చెప్పారు. ప్రేక్షకులకు తాజా కంటెంట్ అందివ్వడంతో పాటు టాలెంట్ ఉన్న కొత్త నటీనటులకు అవకాశం ఇచ్చి వారిని పరిచయం చేయాలని భావిస్తున్నట్లు సాక్షి ధోనీ చెప్పారు. ఇందులో ధోనీ పాక్షికంగా పాలుపంచుకుంటారని స్పష్టం చేశారు. కంపెనీ రోజువారీ కార్యకలాపాలు తానే చూసుకుంటానని సాక్షి ధోనీ చెప్పారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి క్వాలిటీ కంట్రోల్ పని చేస్తుందని ఆమె వివరించారు. తమ టీమ్ ఇచ్చే ఇన్పుట్స్ పై తుది నిర్ణయం ధోనీ తను తీసుకుంటారని సాక్షి ధోనీ చెప్పారు. హృదయానికి హత్తుకునే లాంటి కథలతో ముందుకు వస్తామని సాక్షి చెప్పారు.
ఐపీఎల్లో బిజీగా ఉన్న ధోనీ
ఇదిలా ఉంటే ధోనీ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో బిజీగా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోనీ ఈ సారి జరుగుతున్న టోర్నీలో అంత సక్సెస్ చూడలేకపోయాడు. మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సారి ప్రారంభ మ్యాచ్లో విజయం సాధించినప్పటికీ రెండు మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. రైనా, హర్భజన్, రాయుడులు లేని లోటు ఆ జట్టును వేధిస్తోంది. అయితే తదుపరి మ్యాచ్లో గెలిచి తీరుతామనే ఆత్మవిశ్వాసాన్ని ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తోంది.