మాల్యా తర్వాత నీరవ్ మోడీ: "ఆర్థిక నేరస్తుడు" ట్యాగ్ ఇచ్చిన ముంబై స్పెషల్ కోర్టు
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా రుణం పొంది ఆ తర్వాత ఆ రుణంను ఎగొట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని ముంబై ప్రత్యేక కోర్టు ఆర్థిక నేరస్తుడిగా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్ జైలులో ఉన్నాడు. ముంబైలోని ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కోర్టు నీరవ్ను ఆర్థిక నేరగాడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్ మాల్యా తర్వాత ఆర్థిక నేరస్తుడనే ముద్ర పడిని రెండవ వ్యక్తిగా నీరవ్ మోడీ నిలిచాడు. గతేడాది పార్లమెంటులో ఆర్థిక నేరగాళ్లపై ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది కేంద్రం.
ఆర్థిక నేరస్తులుగా ఒక వ్యక్తిపై ముద్ర పడితే అతని ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కును విచారణ సంస్థలకు ఈ చట్టం కల్పిస్తుంది. అంతేకాదు విచారణకు హాజరుకాకుండా విదేశాలకు పారిపోయే వారి ఆస్తులను కూడా అటాచ్ చేసేందుకు విచారణ సంస్థలకు అన్ని అధికారాలను కట్టబెడుతూ చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఆర్థిక నేరస్తుడిగా ముద్ర పడిన తొలి వ్యక్తిగా విజయ్ మాల్యా నిలిచారు. వివిధ బ్యాంకుల నుంచి విజయ్ మాల్యా రూ.9వేల కోట్లు రుణంగా పొంది ఆ రుణాలను చెల్లించకుండా ఎగవేసి యూకేకు పారిపోయారు. అయితే మాల్యాను తిరిగి భారత్కు రప్పించేందుకు భారత విచారణ సంస్థలు అక్కడి కోర్టును ఆశ్రయించాయి.
నీరవ్ మోడీ అతని మామ మెహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు. తప్పుడు ధృవపత్రాలు చూపించి రుణాలు పొందారు. ఎప్పుడైతే ఈ కుంభకోణం వెలుగు చూసిందో ఇక అప్పటి నుంచి ఇద్దరు పరారీలో ఉన్నారు. గతేడాది జనవరిలో ఇద్దరు నిందితులు దేశం వీడి పారిపోయారు. దీంతో సీబీఐ ఈ కేసును విచారణ చేయడం ప్రారంభించింది. ఇదిలా ఉంటే నీరవ్ మోడీ, చోక్సీలు ఇద్దరూ తమపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని చెప్పుకొచ్చారు. తన క్లయింట్ అయిన నీరవ్ మోడీపై భారత ప్రభుత్వం నేరగాడు అనే ముద్ర వేస్తోందని లాయర్ హ్యూగో కీత్ చెప్పాడు.
ఇదిలా ఉంటే నీరవ్ మోడీని ఈ ఏడాది మార్చిలో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక భారత్కు తనను పంపరాదంటూ కోర్టుకు నీరవ్ విన్నవించారు. తన మీద ఆరోపణలు రాకముందే తాను యూకేకు వచ్చేసినట్లు చెప్పాడు.అంతేకాదు బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు బ్రిటన్లో తాను ఒక ఉద్యోగినని చెబుతూ నెలకు 20వేల పౌండ్లు జీతంగా తీసుకుంటూ ప్రభుత్వానికి పన్ను కూడా చెల్లిస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు నీరవ్ మోడీ.