అక్కడ మెరిసేవన్నీ వజ్రాలేనా ... నాగాలాండ్ బొగ్గుగనుల్లో వజ్రాల వేట.. ఎగబడుతున్న జనం
ఉప్పాడ బీచ్ ప్రాంతంలో సముద్రం నుండి బంగారం బయటకు వస్తుంది అంటే జనాలు ఎగబడినట్లుగానే, మన దేశంలోనే ఓ రాష్ట్రంలో జనాలు ఇప్పుడు వజ్రాల కోసం పిచ్చి వాళ్ళ లాగా వెతుకుతున్నారు.ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్లో బొగ్గు గనులు అపారంగా ఉన్నాయి. మంచి నాణ్యత గల బొగ్గుకు పేరుగాంచిన నాగాలాండ్ రాష్ట్రంలోని మోన్ జిల్లాలోని వాంచింగ్ ఒక కుగ్రామం. ప్రస్తుతం ఈ గ్రామం పేరు జనాల వజ్రాల అన్వేషణ నేపధ్యంలో ఆ రాష్ట్రంలో మార్మోగుతుంది .
ఓ గ్రామస్తుడికి దొరికిన వజ్రాలు
అందుకు కారణం రెండు రోజుల క్రితం వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక గ్రామస్తుడికి కళ్ళు మిరుమిట్లు గొలిపే వజ్రాలు దొరికాయి. ఇంకేం ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి జనాలు వజ్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. విలువైన వజ్రాలను వెతుకుతూ వాంచింగ్ స్థానికులు అంతా తవ్వుతున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. జిల్లా యంత్రాంగం అవి నిజంగా వజ్రాల కాదా లేదా వజ్రాల వంటి మెరిసే రాళ్ళా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
స్థానికుల వజ్రాల వేట ... వజ్రాలా కాదా ... దర్యాప్తు చేస్తున్న అధికార యంత్రాంగం
నాలుగు-ఐదు మెరిసే వజ్రాలు ఒక గ్రామస్థుడుకి లభించిన తర్వాత మిగతా గ్రామస్తులంతా ఎంతో ఉత్సాహంగా వజ్రాల వేట మొదలుపెట్టారు. రాళ్ళు భూ ఉపరితలానికి దగ్గరగా ఉన్నాయని అవి వజ్రాలు అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి "అని మోన్ జిల్లా మేజిస్ట్రేట్ తవసీలాన్ అన్నారు. అయితే అవి వజ్రాలా కాదా అన్నది దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర జియాలజీ, మైనింగ్ విభాగానికి చెందిన బృందం వచ్చే వారం ఈ స్థలాన్ని సందర్శిస్తుందని ఆయన చెప్పారు. నాగాలాండ్లో బొగ్గు మరియు పెట్రోలియం నిక్షేపాలు ఉన్నాయి. నాణ్యమైన బొగ్గు కూడా దొరికే ప్రాంతం ఇదే" అని తవసీలన్ తెలిపారు.
బొగ్గుగనుల్లో వజ్రాలు దొరికే ఛాన్స్ : భూగర్భ శాస్త్రవేత్తలు
అక్కడ వజ్రాలు దొరికే అవకాశం లేకపోలేదని, నాగాలాండ్ లోని బొగ్గు గనుల్లో వజ్రాలు బయటపడే అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. దీంతో నాగాలాండ్ లోని వాచింగ్ గ్రామం వార్తల్లోకెక్కింది. అయితే అక్కడ దొరికిన మెరిసే రాళ్లు వజ్రాలు కాదని వాచింగ్ గ్రామ చైర్మన్ తోనీ అంగ్ కూడా నమ్ముతున్నారు. గ్రామస్తులే కాదు, ఆర్మీ, అస్సాం రైఫిల్స్ సిబ్బంది కూడా ఈ స్థలాన్ని సందర్శించి రాళ్ళు నిజంగా వజ్రాలా కాదా అని పరిశీలిస్తున్నారు.
Recommended Video
వజ్రాలు కాదని గ్రామమండలి నిర్ణయం ... ఫేక్ న్యూస్ ప్రచారం చెయ్యొద్దని గ్రామస్తులకు ఆదేశం
ఇవి వజ్రాలు కాదని గ్రామ మండలి నిర్ణయించింది . సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా "ఫేక్ న్యూస్" ప్రచారం చేయకుండా ఉండాలని గ్రామస్తులను ఆదేశించింది. ఏది ఏమైనా నాగాలాండ్ లో నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నకారణంగా అక్కడ లభించే రాళ్ళల్లో వజ్రాలు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. జియాలజీ , మైనింగ్ విభాగం పరిశోధన తర్వాతే అక్కడ వజ్రాలు ఉన్నాయా లేదా అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది.