షాకింగ్: రాజీవ్ ప్రభుత్వం కూల్చివేతకు ఆర్మీ కుట్ర?
న్యూఢిల్లీ: మాజీ ఆర్మీ కమాండర్ ఒకరు బాంబు పేల్చారు. మాజీ వెస్టర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ పీఎన్ హూన్ ఓ షాకింగ్ విషయాన్ని చెప్పారు. 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని ఆర్మీ కూలదోయాలనుకున్నదని బాంబు పేల్చారు. పీఎన్ హూన్ వయస్సు 86.
రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఢిల్లీలో యాక్షన్ నిర్వహించాల్సిందిగా 1987లో మూడు బెటాలియన్లకు ఆదేశాలు ఆందాయనే సంచలన విషయాన్ని చెప్పాడు. తాను ఆ సమయంలో వెస్టర్న్ ఆర్మీ కమాండరుగా ఉన్నట్లు చెప్పారు.
అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ కృష్ణస్వామి సుందర్జీ, వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎఫ్ రొద్రిగ్స్ ఈ కుట్రకు పథకం రచించారని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ది అన్ టోల్డ్ ట్రూత్ పుస్తకంలో పొందుపర్చానని ఆయన చెప్పారు.
రాజీవ్ గాంధీతో సత్సంబంధాలు లేని సీనియర్ నాయకుల ఆదేశంతోనే ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ విషయం రాజీవ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వీసీ శుక్లాకు కూడా తెలుసునన్నారు. 1984 నాటి సిక్కుల ఊచకోతను పట్టించుకోకపోవడం, పాలనలో అవినీతిపట్ల రాజీవ్ పైన నాటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ విషయం తన వీడ్కోలు సమావేశంలో వెల్లడించారని హూన్ చెప్పారు.
అయితే, సైనిక కుట్ర దేసానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పీఎన్ హూన్ చెప్పారు. రాజీవ్ ప్రభుత్వాన్ని కూలదోస్తే దేశ పాలన పగ్గాలు సైన్యం చేతిలోకి వెళ్తాయన్న భయంతోనే జైల్ సింగ్ సాహసం చేయలేకపోయారని హూన్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా, హూన్ ఆరోపణలను 94 ఏళ్ల మాజీ ఎయిర్ మార్షల్ రణధీర్ సింగ్ ఖండించారు. సైనిక కుట్రకు ఎప్పుడు ప్రణాళిక వేయలేదని, కుట్రకు అవకాశం లేని శిక్షణను సైన్యానికి ఇప్పిస్తామని చెప్పారు.