Coronavirus:కోవిడ్-19 ఒక డెడ్లీ వైరస్ అని చైనా కావాలనే ప్రపంచదేశాలకు చెప్పలేదా..?
కరానావైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి. చైనాలో తొలిసారిగా బయటపడ్డ ఈ అంటువ్యాధి క్రమంగా ఇతరదేశాలకు పాకి అక్కడి ప్రజలను కూడా బలిగొంది. దాదాపుగా 5లక్షల పాజిటివ్ కరోనాకేసులు , 23వేల మరణాలు చైనాలో నమోదయ్యాయి. ఇక రోజురోజుకూ కరోనావైరస్ విజృంభిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై కలిసి పోరాడేందుకు డ్రాగన్ కంట్రీ పిలుపునిచ్చింది. అయితే ఈ మహమ్మారి బయటపడిన తొలినాళ్లలోనే దీని తీవ్రతపై చైనా పారదర్శకంగా చెప్పి ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకీ చైనా ఈ మహమ్మారికి సంబంధించిన సమాచారంను ఎందుకు దాచిపెట్టింది...?
గతేడాది డిసెంబర్ నెలలో తొలి కేసు
గతేడాది డిసెంబర్ నెలలో చైనాలోని వూహాన్ నగరంలో కరోనావైరస్ తొలికేసు బయటపడింది. ఆ తర్వాత వరుసగా మరణాలు సంభవించాయి. దీని తీవ్రత తెలిసికూడా చైనా ఇతర ప్రపంచ దేశాలను అలర్ట్ చేయడంలో విఫలమైంది. ఒకవేళ అప్పుడే చైనా ఇతరదేశాలను వైరస్ తీవ్రత గురించి అలర్ట్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. ఒక జంతు జాతి నుంచి కరోనావైరస్ వ్యాప్తి చెంది మనిషికి సోకింది. ఆ తర్వాత ఇది ఒక డెడ్లీ ఇన్ఫెక్షన్గా రూపాంతరం చెందింది. ఇది తొలిసారిగా డిసెంబర్ 1, 2019లో చైనాలోని వూహాన నగర నివాసిలో బయటపడింది. ఇది బయటపడిన ఐదు రోజులకు ఈ వ్యక్తి భార్యకు కూడా సోకింది. ఆమె వూహాన్ మార్కెట్కు వెళ్లిందని హిస్టరీ ద్వారా తెలుస్తోంది. ఆమెకు న్యుమోనియా వ్యాధి వచ్చిందని వైద్యులు తేల్చేసి ఐసోలేషన్కు తరలించారు.
వ్యాధి సంక్రమిస్తుందని తెలిసి కూడా....
ఇక డిసెంబర్ రెండవ వారంలో మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుందన్న చేదు నిజాన్ని వైద్యులు తెలుసుకున్నారు. ఇక డిసెంబర్ 25వ తేదీన ఓ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందిలో ఈ వైరస్ను గుర్తించారు. ఇలా క్రమంగా అంతకంతకూ వూహాన్ నగరంలో కరోనావైరస్ కేసులు పెరుగుతూ పోయాయి. ఇక ఈ వైరస్ గురించి మొట్టమొదటిసారిగా చెప్పిన లీ వెన్లియాంగ్ అనేడాక్టర్ ఇతర వైద్యసిబ్బందిని జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు కూడా చేశారు. ఈ ఇన్ఫెక్షన్ పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా కరోనావైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందే వైరస్ కాదని ఇప్పటి వరకు ఎలాంటి మెడికల్ సిబ్బందికి వ్యాధి సోకలేదని వూహాన్ మున్సిపల్ హెల్త్ కమిషన్ డిసెంబర్ 31న ఒక ప్రకటన చేసింది.
వ్యాధి గురించి హెచ్చరించిన డాక్టర్ మృతి
ఇక క్రమంగా న్యూమోనియాతో బాధపడుతూ వూహాన్ నగరంలో 59 మంది హాస్పిటల్లో చేరారు. ఇక జనవరి 6వ తేదీన తొలిసారిగా చైనా ప్రబుత్వం లెవెల్ 1 ట్రావెల్ వాచ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక జనవరి 11న కరోనావైరస్ బారిన పడి తొలి మరణం సంభవించినట్లు అధికారులు ప్రకటించారు. మృతి చెందిన వ్యక్తి వూహాన్ మార్కెట్లో సంచరించినట్లు చెప్పారు. ఇక వైరస్ గురించి తొలిసారిగా హెచ్చరించిన డాక్టర్ లీ వెన్లియాంగ్ జనవరి 12న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆయనకు తెలియకుండా కరోనావైరస్ సోకిన వ్యక్తికి చికిత్స చేసినట్లు చెప్పాడు. వెంటిలేటర్ ద్వారా ఆయనకు శ్వాసను అందించారు. చికిత్స పొందుతూ ఆయన ఫిబ్రవరిలో మృతి చెందాడు. ఇక ప్రాథమిక ఇన్వెస్టిగేషన్స్ ద్వారా కరోనావైరస్ మనిషి నుంచి మనిషికి సంక్రమించిందని చైనా కనుగొన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 15న ఒక నివేదిక విడుదల చేసింది.
Recommended Video
మనిషి నుంచి మనిషికి సోకుతుందంటూ డబ్ల్యూహెచ్ఓ ప్రకటన
ఇక ఒక మనిషి నుంచి మరో మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుందని చైనా డాక్టర్లకు ముందుగానే తెలిసినప్పటికీ ఓ చోట 40వేల మంది గుమికూడినప్పటికీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. ఇక ఈ వైరస్ను చికిత్స ద్వారా అంతం చేయగలమని చైనా డాక్టర్లు జనవరి 19న ప్రకటన చేశారు. అదే సమయంలో వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సంక్రమించిందంటూ చైనా ఆరోగ్య శాఖ అధికారులు తొలిసారిగా ప్రకటన చేశారు. జనవరి 22న వూహాన్ నగరంను సందర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన బృందం అక్కడ టెస్ట్ కిట్స్ను చూసి కరోనావైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తోందని ప్రకటించారు. ఇక దేశం దాటరాదని చైనా తమ ప్రజలకు ఆంక్షలు విధించింది. కానీ అప్పటికే చైనా నుంచి చాలామంది ఇతర దేశాలకు వెళ్లారు. ఇక ఈరోజు చైనా నుంచి సోకిన ఈ వ్యాధి దాదాపు 170 దేశాలకు విస్తరించింది. ఇటలీ స్పెయిన్ దేశాల్లో మాత్రం ప్రజలు పిట్టలు రాలినట్లు రాలుతున్నారు. ఇప్పటికే ఇటలీలో 8215 మంది మృతి చెందారు.
చైనా కావాలనే ఈ మహమ్మారి గురించి ప్రపంచదేశాలకు చెప్పలేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఒకవేళ వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని తొలినాళ్లలోనే బయటపెట్టి ఉండి ఉంటే ఇంతటి వినాశనం జరిగేది కాదేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.