ఆ ఇద్దరి మరణం ముందే ఊహించారా ? ఆస్ట్రాలజర్ బెజన్ దరువాలా లైఫ్ లో ఎన్నో సంచలనాలు
భారతదేశంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్న ప్రసిద్ధ జ్యోతిష్యులు బెజన్ దరువాలా అస్వస్థతతో మృతిచెందారు. బెజన్ దరువాలా తన జీవితంలో ఎన్నో సంచలనాత్మకమైన విషయాలను బయటపెట్టి దేశం దృష్టిని ఆకర్షించిన ప్రముఖ జ్యోతిష్యుడు. అంతేకాదు ప్రసిద్ధ జ్యోతిశ్శాస్త్ర కాలమిస్టు లలో ఒకరిగా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అహ్మదాబాద్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా కూడా పనిచేశారు.
Recommended Video
కరోనా తో బెజన్ చనిపోయారని పుకార్లు .. ఖండించిన తనయుడు
89 సంవత్సరాల వయసున్న బెజన్ దరువాలా గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడు తున్నారు. ఆయన గత రాత్రి తుదిశ్వాస విడిచారని అహ్మదాబాద్లోని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయన కరోనా బారిన పడి మృతి చెందారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. ఇక ఈ వార్తలను ఆయన కుమారుడు నాస్టూర్ దరువాలా ఖండించారు. మీడియాతో ఎప్పటికీ సత్సంబంధాలు కలిగి ఉండే బెజన్ దరువాలాకు చాలామంది ప్రముఖులతో సత్సంబంధాలున్నాయి.
ఆ ఇద్దరు ప్రముఖుల మరణాలను ముందే చెప్పిన బెజన్ దరువాలా
బెజన్ దరువాలా తన జీవిత కాలంలో ఎన్నో సంచలనాలను బయటపెట్టారు. రాజీవ్ గాంధీ , సంజయ్ గాంధీ మృతికి సంబంధించి ఆయన తన జ్యోతిష్య శాస్త్రం ద్వారా సంచలన విషయాలు చెప్పారు. వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని ముందే చెప్పిన దరువాలా తన జ్యోతిషంతో అందరినీ ఆకట్టుకున్నారు. దలైలామా అంతటివాడు బెజన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వారు అంటే ఆయన గొప్పతనం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు బెజన్ కు 2015 లో ప్రధాని నరేంద్ర మోడీ సైతం తన చేతికి చూపించానని చెప్పడం విశేషం.
ప్రధాని చెయ్యి చూసి అద్భుతమైన భవిష్యత్ ఉందన్న బెజన్
బెజన్ నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు ఆయన చెయ్యి చూశారని ,అద్భుతమైన భవిష్యత్తు ఉందని బెజన్ చెప్పారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక బెజన్ దరువాలా మృతికి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మృతి పట్ల సంతాపం పాటిస్తూ ఆయన మరణం మమ్మల్ని కలిచివేసింది అంటూ ట్వీట్ చేశారు. ఇక గుజరాత్లోని అహ్మదాబాద్ లో దుధేశ్వర్ స్మశానవాటికలో బెజన్ దరువాలా అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తుంది.