ఆ పోలీస్ జంట ఎవరెస్ట్ ఎక్కలేదా?: ‘మార్ఫింగ్’పై విచారణ
ముంబై: ఇటీవల ఎవరెస్ట్ ఎక్కిన మహారాష్ట్రకు చెందిన పోలీస్ జంట దినేష్, తారకేశ్వరీ రాథోడ్.. అసలు ఎవరెస్ట్ ఎక్కారా? లేక ఫొటోలు మార్పింగ్ చేసి అలా ప్రచారం చేసుకున్నారా? అనేది సందేహంగా మారింది. వీరు మూడు వారాల క్రితం ఎవరెస్ట్ను అధిరోహించి వచ్చిన తొలి జంటగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
'సమ్మిట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్' పేరిట సదస్సు జరుగగా, దానికి వెళ్లిన వీరు.. అక్కడి నుంచి ఎవరెస్ట్ ఎక్కినట్లు చెప్పుకున్నారు. అంతేగాక, ఆ శిఖరంపై వీరు దిగినట్లుగా చెప్పుకుంటున్న చిత్రాలను దాదాపు అన్ని వార్తా ఛానళ్లు, పత్రికలూ ప్రచురించాయి. అంతేగాక, వీరిద్దరినీ పొగుడుతూ విస్తృత ప్రచారం కల్పించారు.
అయితే, ఇప్పుడు దినేష్, తారకేశ్వరీ జంటపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు వీరిద్దరూ ఎవరెస్ట్ ఎక్కలేదని, మార్ఫింగ్ ఫోటోలతో ప్రచారం చేసుకున్నారని ఆరోపణలు రావడమే కారణం.
అదే సదస్సుకు మహారాష్ట్ర నుంచి వెళ్లిన పలువురు పర్వతారోహకులు.. దినేష్ దంపతులు అసలు సదస్సుకే రాలేదని, మహారాష్ట్ర కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పుణె పోలీస్ కమిషనర్ రష్మీ శుక్లా దీనిపై విచారణకు ఆదేశించారు. ఇదే విషయమై స్పందించేందుకు తారకేశ్వరి నిరాకరించారు.
పోలీసు విచారణలో అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని అన్నారు. కాగా, తాము మే 23న ఎవరెస్ట్ ఎక్కామని ఈ జంట చెప్పుకోగా, జూన్ 6న దేశవ్యాప్తంగా పత్రికలు వీరిని కొనియాడుతూ చిత్రాలను ప్రచురించాయి.
మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు వీరిని ప్రత్యేకంగా అభినందించారు కూడా. మే 23న వీరిద్దరూ ఎవరెస్ట్ ఎక్కనే లేదని అంజలీ కులకర్ణి, శరద్ కులకర్ణి, సురేంద్ర షల్కే, ఆనంద్ బన్సోడే తదితర పర్వతారోహకులు ఫిర్యాదు చేశారు. ఆ పోలీస్ జంట బేస్ క్యాంపు వద్ద కూడా కనిపించలేదని చెప్పారు. దీనిపై ప్రాధమిక విచారణ జరిపిన అధికారులు జూన్ 27న స్టేట్మెంట్లను రికార్డు చేశారు. పూర్తి విచారణ తర్వాత అసలు విషయం వెలుగులోకి వస్తుంది.