జైష్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడిలోనే అజహర్ చనిపోయాడా, పాక్ డ్రామాలు చేస్తోందా?
ఇస్లామాబాద్: జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ మృతి చెందినట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ పాకిస్థాన్లోని రావల్ఫిండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను మరణించినట్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వెలువడుతున్నాయి.
కొంతకాలంగా మసూద్ అజహర్ అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నారని, కాలు కూడా బయట పెట్టే స్థితిలో లేరని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇదివరకు ప్రకటించింది. పాక్ ప్రకటనల నేపథ్యంలోను అనేక మసూద్ అజహర్ మృతిపై అనేక కథనాలు వస్తున్నాయి.
మృతి చెందాడా
అసలు నిజంగానే మసూద్ అజహర్ మృతి చెందాడా, చనిపోతే ఎలా చనిపోయేడనే దాని పైన కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. గత నెల 26వ తేదీన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ తదితర మూడు ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలపై బాంబులు విడిచిన విషయం తెలిసిందే. ఈ దాడిలో శిక్షణలో ఉన్న వందల సంఖ్యలో తీవ్రవాదులు మృతి చెందినట్లుగా చెబుతున్నారు.
దాడుల సమయంలో అజహర్ అక్కడే ఉన్నాడా
పాక్ - భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు రోజుల క్రితం పాక్ మంత్రి మాట్లాడుతూ... పాకిస్తాన్ ఇస్లామాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. ఇప్పుడు అతను మృతి చెందినట్లుగా ప్రచారం సాగుతోంది. ఉగ్రవాద శిబిరాల్లో దాడుల సమయంలో అజహర్ అక్కడే ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాంబు దాడిలోనే అతను గాయపడ్డాడా? గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడా? లేక ఘటన స్థలంలోనే మృతి చెందాడా? అనే చర్చ సాగుతోంది.
ఒప్పుకోవడానికి పాక్ డ్రామాలు చేస్తోందా?
పుల్వామా దాడి మొదలు పాకిస్తాన్ డ్రామాలు ఆడుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. పుల్వామా తీవ్రవాద దాడితో తమకు ప్రమేయం లేదని చెప్పింది. తాము ఉగ్రవాదాన్ని పెంచి పోషించమని, తామూ ఉగ్రబాధితులమే అని చెప్పింది. మసూద్ అజహర్ తమ దేశంలో లేడని చాలాకాలంగా చెబుతూ వస్తోంది. కానీ ఆ తర్వాత మాట మార్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ దాడి చేసినప్పుడు కూడా తమకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పింది. కానీ తాజాగా, జైష్ లీడర్లే.. తమకు బాగా నష్టం జరిగిందని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఇండియన్ పైలట్ అభినందన్ను విడుదల చేయడం సరికాదని మండిపడ్డారు. దీంతోనే నష్టంపై పాక్ అబద్దాలు ఆడిందని తేలిపోయింది. అలాగే, తాము భారత్కు చెందిన రెండు యుద్ధ విమానాలను పడగొట్టామని, ఇద్దరు పైలట్లు తమ ఆదీనంలో ఉన్నారని చెప్పింది. కానీ తమ చేతిలో ఒక పైలట్ (అభినందన్) మాత్రమే ఉన్నాడని సాయంత్రానికి మాట మార్చింది. రెండు యుద్ధ విమానాలు కూల్చామని చెప్పినప్పటికీ అందులో ఒకటి.. పాకిస్తాన్కు చెందిన ఎఫ్ 16. కానీ అది ఇండియాది అని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నాలు చేసి అబాసుపాలైంది. ఆధారాలతో సహా అది పాక్ విమానం అని తేలింది. ఇప్పుడు మసూద్ అజహర్ విషయంలోను.. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి వల్లే చనిపోతే.. దానిని అంగీకరించేందుకు మనసు అంగీకరించక అజహర్ ఆరోగ్యం బాగా లేదని మొదట చెప్పి, ఇప్పుడు అనారోగ్యంతో చనిపోయాడని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తోందా అనే చర్చ సాగుతోంది. భారత్ తమ దేశంలోకి వచ్చి ఓ అంతర్జాతీయ ఉగ్రవాదిని చంపేసి వెళ్లిందని ప్రపంచానికి తెలిస్తే అవమానం అని భావిస్తోందా.. తెలియాల్సి ఉంది.
బతికే ఉన్నాడని జైష్, సీరియస్ అని పాక్ మంత్రి
మరోవైపు, మసూద్ అజహర్ బతికే ఉన్నాడని జైష్ ఎ మహ్మద్ తెలిపింది. అజహర్ మృతి చెందాడన్న మీడియా వార్తలను కొట్టి పారేసింది. అజహర్ పరిస్థితి చాలా సీరియస్గా ఉందని అంతకుముందు పాక్ మంత్రి చెప్పాడు.