పుల్వామా దాడి బీజేపీకి కలిసొచ్చింది : ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. సార్వత్రిక ఎన్నికల కంటే కొద్దిరోజుల ముందు పుల్వామాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ చేసిన దాడితో ప్రధాని మోదీకి కలిసొచ్చిందని పేర్కొన్నారు. 40 మంది భారత జవాన్ల వీరమరణం .. ప్రధాని మోదీకి మేలుచేసిందని గుర్తుచేశారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు కేజ్రీవాల్.
దాడి చేస్తే .. శాంతిమంత్రమా ?
ఇది తనొక్కడికి కలిగిన సందేహం కాదన్నారు కేజ్రీవాల్. ఎన్నికల ముందు ఈ చర్య మోదీకి కలిసి వస్తోందని ప్రతి ఒక్కరూ భావించారని ఉద్ఘాటించారు. దీనికితోడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా మోదీకి వత్తాసు పలికారిన హాట్ కామెంట్స్ చేశారు. ఇదివరకు దాయాది దేశ ప్రధాని ఇలా మాట్లాడలేదని గుర్తుచేశారు. పుల్వామా దాడి తర్వాత భారత వైమానిక దళం దాడి చేస్తే .. పాకిస్థాన్ ప్రధాని మాత్రం శాంతి మంత్రం జపించారని .. ఇదీ మోదీ, ఇమ్రాన్ ఖాన్ చీకటి ఒప్పందానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.
ఇమ్రాన్ అంతర్యమేంటీ ?
ఇటీవల ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. శాంతి మంత్రంతో ఎన్నికల్లో మోదీకి లబ్ధి చేకూరితే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తోందని విదేశీ మీడియా ప్రతినిధులతో ఖాన్ వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ఖాన్ ఉద్దేశాన్ని కేజ్రీవాల్ నొక్కి వక్కానించారు. అంతేకాదు బీజేపీకి చెందిన నమో టీవీ చానెల్కు పాకిస్థాన్ నిధులు సమకూరుస్తోందా అని ప్రశ్నించారు.
వేగంగా స్పందించింది ?
ఫిబ్రవరి 14న పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదుల చేసిన దాడితో 40 మంది జవాన్లు ఆసువులు బాశారు. ఆ తర్వాత భారత్ వెంటనే స్పందించి పాకిస్థాన్లోని బాలాకోట్లో గల ఉగ్రవాద శిబిరంపై వాయుసేన దాడులు చేసింది. ఎన్నికల వేళ మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వేగంగా స్పందించిందని .. దీంతో బీజేపీకి మేలు జరుగుతోందని అంచనా వ్యక్తమైందని గుర్తుచేశారు కేజ్రీవాల్.