రాహుల్ గాంధీ మాంసం తిని కైలాష్ మానససరోవర యాత్రకు వెళ్లారా ? బీజేపీ, నేపాల్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద మరోసారి ఆరోపణలు గుప్పుమన్నాయి. రాహుల్ గాంధీ కైలాష్ మానససరోవరం యాత్రకు బయలుదేరే ముందు నేపాల్ లోని ఓ రెస్టారెంట్ లో మాంసాహారం ఆరగించారని ఆరోపణలు వచ్చాయి.
రాహుల్ గాంధీ భోజనం చెయ్యడానికి వచ్చిన సమయంలో ఆయన మాంసాహారం సేవించారని రెస్టారెంట్ ఉద్యోగి సమాచారం ఇచ్చారని నేపాల్ వెబ్ సైట్ లు వార్తలు ప్రచురించాయి. రెస్టారెంట్ ఉద్యోగి స్వయంగా రాహుల్ గాంధీకి మాంసాహారం అందించాడని నేపాల్ మీడియా అంటోంది.
అనంతరం అనేక మీడియా సంస్థలు రాహుల్ గాంధీ కైలాష్ మానససరోవరం యాత్ర చేపట్టకముందు మాంసాహారం ఆరగించారా అంటూ రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించాయి. రాహుల్ గాంధీ కైలాష్ మానససరోవరం యాత్రపై బీజేపీ నాయకులు విమర్శలు మొదలుపెట్టారు.
రాహుల్ గాంధీ కైలాష్ మానససరోవరం యాత్రకు బయలుదేరే ముందు రెస్టారెంట్ లో చికెన్ తిన్నారని స్వయంగా అక్కడ పని చేసే ఉద్యోగి స్థానిక మీడియాకు చెప్పాడని బీజేపీ అధికారి ప్రతినిధి అమిత్ మాళ్వియా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ పదేపదే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాళ్వియా ఆరోపించారు. అయితే రాహుల్ గాంధీ పూర్తి శాఖాహారం భోజనం తిన్నారని, మాంసాహారం ముట్టుకోలేదని రెస్టారెంట్ యాజమాన్యం వివరణ ఇచ్చింది.
2018 కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారం సందర్బంగా రాహుల్ గాంధీ ఆనేక ఆలయాలు సందర్శించారు. ఆ సమయంలో మాంసాహారం ఆరగించి రాహుల్ గాంధీ ఆలయాలకు వెళ్లారని బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. 2018 ఏప్రిల్ నెలలో కర్ణాటకలోని హుబ్బళిలో విమాన ప్రమాదం నుంచి క్షణాలలో బయటపడిన రాహుల్ గాంధీ దేవుడి ఆశీర్వాదం తీసుకోవడానికి ఆగస్టు 31వ తేదీన కైలాష్ మానససరోవరం యాత్రకు బయలుదేరారు.