తమాషాగా ఉందా: మొత్తం డ్రగ్స్ను ఎలుకలు తినేశాయా...ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు చురక
ఢిల్లీ: ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లలో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఇతరత్ర చెత్తాచెదారంతో స్టేషన్లలో పరిశుభ్రత కొరవడిందన్న పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ చేసింది. జస్టిస్ మదన్ బీ లోకూర్ , జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేసును విచారణ చేసింది. కొన్ని ఏళ్లు గడిచినప్పటికీ కూడా స్వాధీనం చేసుకోబడ్డ వాహనాలను ఎందుకు విక్రయించలేదని పోలీస్ శాఖను ధర్మాసనం ప్రశ్నించింది. వాహనాల ఓనర్లు తమ వాహనాలను తీసుకునేందుకు రాకపోతే అమ్మేయాలని సూచించింది.
నార్కోటిక్స్ లేదా డ్రగ్స్ కేసులు విచారణకు వచ్చిన సమయంలో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ను ఎలుకలు తినేశాయని పోలీసులు కోర్టులకు తెలుపుతున్నారని అది ఎంత మేరకు వాస్తవమని జస్టిస్ దీపక్ గుప్తా ప్రశ్నించారు. నార్కోటిక్స్ కేసులు మూడు నాలుగేళ్ల తర్వాత విచారణకు వస్తే పోలీస్ స్టేషన్లలో స్వాధీనం చేసుకుని స్టోర్ రూమ్లలో ఉంచిన మెటీరియల్ కనిపించదని అది ఏమిటని ప్రశ్నిస్తే ఎలుకలు తినేశాయని పోలీసులు చెబుతున్నారని జస్టిస్ దీపక్ గుప్తా అన్నారు. ఈ క్రమంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం బయటకంటే పోలీస్ స్టేషన్లోని స్టోర్ రూమ్ల నుంచే డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోందని తెలిపింది.
100 కేజీల హెరాయిన్ దొరికితే.. అందులో కొంచెం కూడా స్టోర్ రూమ్లో ఉండదని బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాదు పట్టుబడ్డ వాహనాలకు సంబంధించిన ఓనర్ పోలీస్ స్టేషన్కు మూడు నెలల్లోగా రాకపోతే వాటిని ఎందుకు విక్రయించడంలేదని ప్రశ్నించింది. వాహనం విక్రయించాక దాని యజమాని వస్తే ఆ డబ్బును అతనికి చెల్లించండి లేదా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో వేయండి అంటూ ఆదేశించింది. దీనికి సమాధానం ఇచ్చిన పోలీస్ శాఖ... స్వాధీనం చేసుకున్న వాహనాలు కోర్టు సొత్తని తాము కేవలం కస్టోడియన్గానే వ్యవహరిస్తామని తెలిపింది. పిటిషన్ను విన్న సుప్రీంకోర్టు అక్టోబర్ 10 కేసును వాయిదా వేసింది.