అభినందన్ విడుదల వెనక అమెరికా కృషి ఉందా..? ట్రంప్ వ్యాఖ్యలు దేనికి సంకేతం
ఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో త్వరలోనే మంచి వార్త వింటారని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. యుద్ధఖైదీగా పాకిస్తాన్కు పట్టుబడ్డ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విండ్ కమాండర్ అభినందన్ వర్దన్ను శుక్రవారం విడుదల చేస్తామని పాకిస్తాన్ తెలిపింది. ఈ ప్రకటన స్వయంగా ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్లమెంటులో తెలపడంతో దీని వెనక మాస్టర్ మైండ్ అమెరికా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్ పాకిస్తాన్ల మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. అంతేకాదు ప్రతీ విషయం అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపేతో అన్ని విషయాలు చర్చిస్తున్నారు భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్. ఇక హనోయ్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు గురువారం ఉదయం రెండు దేశాల మధ్య పరిస్థితులు చక్కబడుతాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు అమెరికా ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తోందని కూడా చెప్పారు. ఇరు దేశాలు యుద్ధానికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నాయని అయితే అమెరికా ఒక పరిష్కారం మార్గం కనుగొనేందుకు ప్రయత్నిస్తోందంటూ ట్రంప్ చెప్పారు. అంతేకాదు రెండుదేశాలకు సహకరించేలా అడుగులు ముందుకేస్తున్నట్లు ట్రంప్ వివరించారు. ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్ది గంటలకే యుద్ధ ఖైదీగా పట్టుబడ్డ అభినందన్ వర్ధన్ విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది.
ఇక ఇదిలా ఉంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా రెండు దేశాలు ప్రయత్నించాలని వైట్ హౌజ్ వర్గాలు చెప్పాయి. భారత్ పాక్లు యుద్ధ వాతావరణం నెలకొనకుండా నిగ్రహంతో వ్యవహరిస్తాయని మైక్ పాంపే చెప్పారు. అంతేకాదు ఇరుదేశాల విదేశాంగ మంత్రులతో తాను వేర్వేరుగా మాట్లాడినట్లు తెలిపారు. నేరుగా మాట్లాడుకునేలా రెండుదేశాలు సిద్ధం అవ్వాలని ఎలాంటి మిలటరీ చర్యలకు దిగరాదని తాను భారత్ పాక్ విదేశాంగ మంత్రులకు సూచించినట్లు చెప్పారు.
ఇక అమెరికా ప్రయత్నాలు ప్రారంభించిన నాలుగు గంటల్లోనే పాకిస్తాన్ నుంచి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధన్ను శుక్రవారం విడుదల చేస్తామనే ప్రకటన వెలువడింది. అంతకుముందు అంతర్జాతీయంగా పాకిస్తాన్ పై ఒత్తిడి వచ్చింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్ను బ్లాక్లిస్టులో చేర్చాలని డిమాండ్ చేశారు.