రాష్ట్రపతి సెక్యూరిటీ గార్డులుగా ఆ మూడు కులాలకు చెందినవారే ఉంటారెందుకు..?
ఆయన త్రివిధదళాలకు అధిపతి, దేశానికి ప్రథమ పౌరుడు. మరి అలాంటి వ్యక్తికి సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు. అవును మనము చెప్పుకుంటున్నది మన దేశ రాష్ట్రపతి గురించే. రాష్ట్రపతి భద్రతా సిబ్బంది ఎంపిక గురించి తెలుసుకుంటే షాక్ అవుతాము. రామ్నాథ్ కోవింద్ సెక్యూరిటీ సిబ్బంది మూడు కులాలకు చెందిన వారు మాత్రమే ఉంటారట. అది ఎందుకు అలా జరుగుతుందో... ఆ మూడు కులాల నుంచే సిబ్బంది ఎంపిక ఎందుకు జరుగుతోందో అనేదానిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఆశ్చర్యపోయిన న్యాయస్థానం ఆ మూడుకులాల వారే రాష్ట్రపతి భద్రతా సిబ్బందిగా ఎందుకు ఉంటారో తెలపాలని కేంద్రానికి, భారత ఆర్మీ ఛీఫ్కు నోటీసులు పంపింది.
రాష్ట్రపతికి భద్రతా సిబ్బందిగా మూడుకులాలకు చెందిన వారు మాత్రమే ఎందుకు ఉంటారో దానివెనకున్న కారణమేమిటో తెలపాలని హర్యానాకు చెందిన గౌరవ్ యాదవ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది సెప్టెంబర్లో రాష్ట్రపతి సిబ్బందికోసం జరిగిన రిక్రూట్మెంట్లో ఎంపికైన అభ్యర్థులంతా ఆ మూడు కులాలకు చెందిన వారే కావడంతో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ మూడు కులాలు కూడా జాట్లు, రాజ్పుత్లు, సిక్కు కులాలకు చెందిన వారికి మాత్రమే పిలుపు వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు పిటిషనర్. రాష్ట్రపతి బాడీగార్డ్ పోస్టుకోసం విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం తనకు అన్ని అర్హతలున్నాయని ఒక్క కులం మాత్రమే వేరు అని కోర్టుకు తెలిపాడు గౌరవ్ యాదవ్. తాను యాదవ సామాజిక వర్గానికి చెందినవాడినంటూ పిటిషన్లో పేర్కొన్నాడు.అయితే రిక్రూట్మెంట్లో భాగంగా కేవలం మూడు సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని మిగతావారిని విస్మరించారని వెల్లడించాడు.
రాష్ట్రపతికి ఆ మూడు సామాజిక వర్గాలకు చెందిన వారే బాడీగార్డులుగా ఎంపికవడంపై 2013లోనే చర్చ జరిగింది. రాష్ట్రపతి సెక్యూరిటీ గార్డ్స్గా హిందూ జాట్లు,హిందూ రాజ్పుత్లు, జాట్ సిక్కుల సామాజిక వర్గానికి చెందిన వారికోసమే నియమకాలు చేపట్టినట్లు ఆర్మీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే దీని వెనక ఫలానా కులం కానీ, ఫలానా మతం కానీ ఉండాలన్నది ఉద్దేశం కాదని ఆర్మీ వివరణ ఇచ్చింది.
రంజాన్ శుభాకాంక్షలు: రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ సందేశం
ఎవరిపట్ల తమకు దురుద్దేశం లేదని సర్వోన్నత న్యాయస్థానంకు తెలిపిన ఆర్మీ... రాష్ట్రపతి భవన్లో జరిగే పలు కార్యక్రమాలకు మంచి హైట్,చూసేందుకు మంచి లుక్ ఉన్న వారినే ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించింది. అయితే ఇది పనిలో భాగంగానే ఎంపిక జరుగుతుందే తప్ప మరో సామాజిక వర్గానికి అన్యాయం చేసేందుకు కాదని ఆర్మీ స్పష్టం చేసింది. గతంలో కూడా హర్యానాకు చెందిన డాక్టర్ ఐఎస్ యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఆ సమయంలో ఆర్మీ రిక్రూట్మెంట్ను రద్దు చేయాల్సిందిగా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు కులం, ప్రాంతం, మతం ప్రాతిపదికన రిక్రూట్మెంట్ నిర్వహించడం అన్యాయమని పేర్కొన్నారు.