నేతలను బంధించి బిల్లు పాస్ చేయించుకుంటారా ..? మోడీ సర్కార్పై దీదీ గుస్సా
న్యూఢిల్లీ : కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసి ముందుజాగ్రత్త చర్యగా నేతల అరెస్ట్ చేయడాన్ని విపక్షాలు ఖండించాయి. ఇదీ సరికాదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేతలను అరెస్ట్ చేసి జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లుపై సభలో చర్చ జరుపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.
రాజ్యసభలో కశ్మీర్ విభజన బిల్లుకు ఆమోదం పొందిన క్షణాల్లోనే జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ నేత మెహబూబ ముఫ్తీని అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు .. కేంద్ర పెద్దల ఆదేశాలతో ఆమెను హరి నివాస్ గెస్ట్ హౌస్కు తరలించారు. మరోవైపు మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయమే గృహ నిర్బందం చేయగా .. రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వీరి అరెస్ట్ను విపక్షాలు తప్పుపట్టాయి. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదని సూచించారు. నేతలను అరెస్ట్ చేసి బిల్లును పాస్ చేయించుకుంటారా అని దుమ్మెత్తిపోశారు. వీరితోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాను కూడా అరెస్ట్ చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. కానీ ఫరూక్ను అరెస్ట్ చేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
నేతల అరెస్ట్ను టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీ తప్పుపట్టారు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్అబ్దుల్లా, మెహబూబ ముఫ్తీ అరెస్ట్కు సంబంధించి తన వద్ద సమాచారం లేదని .. కానీ వారిని బంధించడం మాత్రం సరికాదన్నారు. వారు రాజకీయ పార్టీ నేతలే తప్ప ఉగ్రవాదులు కాదని హితవు పలికారు. ఒకవేళ వారిని కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసే వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని .. అదుపులోకి తీసుకుని వ్యవస్థలను మ్యానేజ్ చేయలేరని తేల్చిచెప్పారు.