జై శ్రీరాం అంటూ బూతులు తిడుతున్నారు.. బీజేపీ కార్యకర్తలపై మమత సీరియస్..
కోల్కతా : సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదించలేకపోయింది. ఆ ఫ్రస్టేషన్లో ఉన్న సీఎం మమత బెనర్జీకి బీజేపీ కార్యకర్తలు చిర్రెత్తేలా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా జై శ్రీరాం నినాదాలు చేస్తూ ఇరిటేషన్ పుట్టిస్తున్నారు. దీంతో జై శ్రీరాం మాట వినపడితే చాలు.. దీదీకి కోపం నషాళానికంటుంతోంది. జై శ్రీరాం నినాదాల మాటున బూతులు తిడుతున్నారని ఆరోపిస్తోంది.
భత్పరాలో దీదీకి చేదు అనుభవం
ఎన్నికల అనంతరం బీజేపీ హింసకు పాల్పడిందంటూ గురువారం నైహటి మున్సిపల్ ఆఫీసు ఎదుట నిరసన చేపట్టారు. అక్కడి వెళ్లే సమయంలో ఉత్తర 24 పరిగణాల జిల్లాలోని భత్పరా ఏరియా నుంచి ఆమె కాన్వాయ్ ప్రయాణించింది. కొత్తగా ఎంపీగా ఎన్నికైన బీజేపీ నేత అర్జున్ సింగ్కు పట్టున్న ప్రాంతం కావడంతో కొందరు బీజేపీ కార్యకర్తలు జై శ్రీరాం నినాదాలు చేశారు. దీంతో దీదీకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
బూతులు తిడుతున్నారన్న దీదీ
జై శ్రీరాం నినాదాలు వినిపించగానే మమత బెనర్జీ కారు పక్కన ఆపించారు. బీజేపీ కార్యకర్తల దగ్గరకు వెళ్లి వారికి వార్నింగ్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట చేతబట్టుకుని వచ్చి మమ్మల్నే తిట్టేందుకు ఎంత ధైర్యం అని ప్రశ్నించారు. జై శ్రీరాం నినాదాల మాటున వారంతా తనను బూతులు తిడుతున్నారని దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమె కారు ఎక్కగానే బీజేపీ కార్యకర్తలు మళ్లీ జై శ్రీరాం నినాదాలు చేశారు. దీంతో చిర్రెత్తిపోయిన దీదీ మరోసారి కారు దిగి వచ్చి వారిని హెచ్చరించారు. ఎవరెవరు నినాదాలు చేశారో వారందరి పేర్లు నోట్ చేసుకోమని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
గతంలోనూ ఇలాంటి ఘటనలు
మమత బెనర్జీకి ఇలాంటి ఘటనలు గతంలోనూ ఎదురయ్యాయి. కొన్నాళ్ల క్రితం మిడ్నాపూర్ జిల్లాలోనూ మమత కాన్వాయ్ వెళ్తుండగా.. కొందరు బీజేపీ కార్యకర్తలు జై శ్రీరాం నినాదాలు చేశారు. అది విన్న మమత కారు దిగగానే వారంతా పారిపోయారు. అప్పట్లో దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇదిలా ఉంటే జై శ్రీరాం నినాదాలు చేస్తున్న బీజేపీ కార్యకర్తలు మధ్యలో చెప్పరాని భాషలో బూతులు తిడుతున్నారని.. అందుకే మమత చిరాకు పడుతున్నారని టీఎంసీ వర్గాలు అంటున్నాయి.