బద్ద శత్రువులు కలిసిన వేళ : మోడీకి దీదీ స్వీట్లు, కుర్తీ...
న్యూఢిల్లీ : బద్ద శత్రువులు కలుసుకొన్నారు. వారిలో ఒకరు దేశ రాజకీయాలను శాసిస్తోన్న ప్రధాని మోడీ కాగా మరొకరు బెంగాల్లో రాజ్యమేలుతున్న దీదీ. మొన్నటివరకు కస్సు బుస్సు మీద ఉన్న నేతలు ఒక్కసారిగా కలువడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రధాని మోడీ జన్మదినం తర్వాత ఇద్దరు నేతలు మాట మంతీ ప్రాధాన్యం సంతరించుకుంది.
మంగళవారం ప్రధాని మోడీ 69వ ఏట అడుగిడారు. బర్త్ డే సందర్భంగా ఆయన తన తల్లి వద్దకెళ్లారు. గుజరాత్లో వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. మరునాడు ఢిల్లీలో ప్రధాని ఉండగా బెంగాల్ సీఎం మమతా బెనర్చీ వచ్చారు. మోడీ విష్ చేసి స్వీట్లు, కుర్తా అందజేశారు. సాధారణంగా నేతలకు శుభాకాంక్షలు తెలియజేయడం సహజమే కానీ .. మోడీ అంటేనే ఒంటికాలిపై లేచే దీదీ స్వయంగా రావడమే విశేషం. గత ఎన్నికల నుంచి దీదీకి మోడీకి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. అమిత్ షా తీసిన ర్యాలీలో రాజేసిన చిచ్చు ... రావణ కాష్టమైపోయింది. బెంగాల్లో బీజేపీ వర్సెస్ టీఎంసీ అన్నట్టు ఉంది. కార్యకర్తలు కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీతో దీదీ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
మోడీ బర్త్ డే తర్వాత మమతా బెనర్జీ ఢిల్లీ వచ్చారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాసేపు ముచ్చటించారు. మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు కూడా రానీ దీదీ ... బుధవారం రావడం కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది.