అమిత్ షా ర్యాలీకి పర్మిషన్ ఇవ్వని దీదీ.. నియంతలా మారారని మండిపడ్డ బీజేపీ
కోల్కతా : బెంగాల్లో తృణమూల్ - బీజేపీ మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతోంది. బెంగాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు పరాభవం ఎదురైంది. ఆయన ర్యాలీకి దీదీ సర్కారు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించింది. దీంతో మమత తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా సోమవారం జాదవ్పూర్లో పర్యటించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చివరి నిమిషంలో ర్యాలీకి అనుమతి నిరాకరించింది. అంతేకాదు.. షా చాపర్ ల్యాండింగ్కు ఇచ్చిన పర్మిషన్ కూడా వెనక్కి తీసుకుంది.
తృణమూల్ సర్కారు తీరుపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మమత హయాంలో బెంగాల్లో ప్రజాస్వామ్యం కాస్తా నియంతృత్వంగా మారిపోయిందని బీజేపీ ఆరోపించింది. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడంలేదంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. తృణమూల్ అప్రజాస్వామిక చర్యలపై ఈసీ మౌనంగా ఉండటం దురదృష్టకరమన్న ఆయన.. దీనిపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
దీదీ సర్కారు అమిత్ షాకు షాకివ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయనకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అమిత్ షా మాల్దాలో హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి కోరగా.. మమత ప్రభుత్వం నిరాకరించింది. గతంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు బీజేపీ నేతల చాపర్ల ల్యాండింగ్కు బెంగాల్లో అనుమతి లభించలేదు.