అసెంబ్లీలో బలపరీక్ష కన్నా నిమ్మకాయలు, బిర్యానీలపైనే చర్చ ఎక్కువ! ఎందుకంటే..!?
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం పతనం అంచుల్లో ఉంది. సొంత కూటమికి చెందిన 18 శాసనసభ్యుల రాజీనామాల అనంతరం ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో..అధికార పార్టీ బల పరీక్షను ఎదుర్కొంటోంది. బల పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. కుమారస్వామి ఈ నెల 18వ తేదీన సభలో ప్రవేశపెట్టిన బలపరీక్ష తీర్మానంపై చర్చించడానికి అధికార పార్టీ తరఫున మొత్తం 21 మంది సభ్యులు తమ పేర్లను ఇచ్చారు. విశ్వాస పరీక్షపై వారంతా మాట్లాడాల్సి ఉంది.
మరో రెండు రోజులు..ప్లీజ్: ముఖ్యమంత్రి అభ్యర్థన!
ఈ నేపథ్యంలో సోమవారంఅసెంబ్లీ సమావేశాల్లో కుమారస్వామి ఆహార అలవాట్లపై ఆసక్తికరమైన చర్చ సాగింది. మూడురోజులుగా పతాక స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య సాగిన చర్చ సోమవారం నాటికి కాస్త నవ్వుకునేలా సాగింది. వేల కోట్ల రూపాయల ముడుపులతో ముడిపడి ఉన్న ఐఎంజీ పోంజీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు మన్సూర్ ఖాన్తో కలిసి కుమారస్వామి బిర్యానీ లాగించారని అంటూ ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీ సభ్యుడు సీటీ రవి చేసిన ఆరోపణపై సభలో కలకలం చెలరేగింది. వేల కోట్ల రూపాయలను కాజేసిన మన్సూర్ ఖాన్తో ముఖ్యమంత్రి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని, ఆయనతో కలిసి బిర్యానీ తిన్నారని సీటీ రవి ఆరోపించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఆయన సభలో ప్రదర్శించారు. మన్సూర్ ఖాన్ పక్కనే కుమారస్వామి కూర్చుని భోజనం చేస్తోన్న పిక్ అది.
దీనిపై కుమారస్వామి స్పందించారు. తాను బిర్యానీ తిన్నానని అనడం అబద్ధమని వాదించారాయన. తాను గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న తరువాత బిర్యానీ తినడాన్ని మానేశానని అన్నారు. శాకాహారానికి మాత్రమే పరిమితం అయ్యానని చెప్పారు. మన్సూర్ ఖాన్తో ఫొటో ఎందుకు దిగాల్సి వచ్చిందనడానికి ఆయన వివరణ ఇచ్చుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు ఓ ముఖ్యమంత్రి హోదాలో తనను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారని, ఆ కార్యక్రమానికి తాను హాజరయ్యానని చెప్పారు. అదే విందుకు మన్సూర్ ఖాన్ కూడా వచ్చారని, తనతో కలిసి భోజనం చేశారని అన్నారు. అంతకుమించి- తనకు మన్సూర్ ఖాన్తో పరిచయాలు లేవని అన్నారు కుమారస్వామి. ఇఫ్తార్ విందు సందర్భంగా తాను బిర్యానీని తిన్నానని అనడం సరికాదని అన్నారు.
ఇందులో స్పీకర్ రమేష్కుమార్ జోక్యం చేసుకున్నారు. గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నంత మాత్రాన బిర్యానీని తినడాన్ని మానేయాల్సిన అవసరం లేదని నవ్వుతూ చెప్పారు. ఆహారపు అలవాట్లను ఎందుకు మార్చుకుంటారు?.. అని ప్రశ్నించారు. నాటుకోడి బిర్యానీ, చేపల కూర చాలా బాగుంటుంది. వాటిని తిని చూడండి. కావాలంటే చెన్నమ్మ (కుమారస్వామి తల్లి) గారితో నేను మాట్లాడతా.. అని అన్నారు. స్పీకర్ మాటలకు బీజేపీ సీనియర్ సభ్యుడు ఈశ్వరప్ప గట్టిగా నవ్వారు. దీనితో స్పీకర్ ఎందుకు నవ్వారంటూ ప్రశ్నించారు. మీరు నిప్పులాంటి నిజాన్ని బయటపెట్టినందుకు నవ్వొచ్చింది.. అని ఈశ్వరప్ప బదులిచ్చారు.