కేజీఫ్ స్టార్ యశ్ ఫ్యాన్ ఆత్మహత్య... సూసైడ్ నోట్లో 'చివరి కోరిక' కోరిన అభిమాని...
కేజీఎఫ్ స్టార్ యశ్,కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యలకు వీరాభిమాని అయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీవితంలో పూర్తిగా విఫలమయ్యానని... ఇక తాను బతికి సాధించేది ఏమీ లేదని... అందుకే ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. అంతేకాదు,తాను బాగా అభిమానించే యశ్,సిద్దరామయ్యలు తన అంత్యక్రియలకు హాజరవాలని.. ఇదే తన చివరి కోరిక అని చెప్పుకొచ్చాడు.
కర్ణాటకలోని మండ్యా జిల్లాలో ఉన్న కొడిదొడ్డి గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని రాజేష్గా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు అతను రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. 'జీవితంలో నేనో ఫెయిల్యూర్గా మిగిలిపోయాను. నా తల్లికి మంచి కొడుకుగా ఉండలేకపోయాను. నా సోదరుడికి మంచి సోదరుడిగా ఉండలేకపోయాను. ప్రేమలోనూ విఫలమయ్యాను. ఇక నేను బతికి ఉండి సాధించాల్సింది ఏమీ లేదు. అందుకే చనిపోతున్నా. నేను అభిమానించే యశ్,సిద్దరామయ్యలు నా అంత్యక్రియలకు రావాలన్నది నా చివరి కోరిక..' అని రాజేష్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
రాజేష్ కోరిక మేరకు సిద్దరామయ్య అతని అంత్యక్రియలకు హాజరయ్యారు. అతని మృతదేహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'నాకు తెలిసీ నేనెప్పుడూ అతన్ని కలుసుకోలేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అభిమానిని కలుసుకోవాల్సి రావడం అత్యంత విచారకరం. రాజేష్లా ఇంకెవరూ ఇలా ఆత్మహత్యలకు పాల్పడకూడదు.' అని సిద్దరామయ్య పేర్కొన్నారు. అతని ఆత్మహత్యపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.
అభిమాని ఆత్మహత్యపై హీరో యశ్ స్పందిస్తూ... 'అభిమానులుగా మీరు మాపై కురిపించే చప్పట్లు,విజిల్స్,మీ ప్రేమను మేము ఇష్టపడుతాం. కానీ ఇలాంటివి మీ నుంచి మేము ఆశించం.' అని ట్వీట్ చేశారు. 'అభిమానుల ప్రేమే మాకు జీవితం.మాకు గర్వకారణం. కానీ రామకృష్ణ లాంటి వ్యక్తులు ఇలా ప్రేమను చాటుకోవడాన్ని ఎలా ఇష్టపడగలం. అభిమానుల ప్రేమకు ఇది ఉదాహరణగా మారకూడదు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను. ఓం శాంతి..' అని యశ్ ట్వీట్ ద్వారా అభిప్రాయపడ్డారు. మరోవైపు రాజేష్ ఆత్మహత్యపై మండ్యా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.