దాదాపు సమానమైన పెట్రోల్, డీజిల్ ధరలు- దేశంలోనే తొలిసారి- వరుసగా 18 వ రోజు పెరుగుదల..
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో కుదేలైన చమురు రంగాన్ని గాడిన పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలు సామాన్యులకు మంటపుట్టిస్తున్నాయి. వరుసగా 18వ రోజు దేశవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. అదే సమయంలో దేశంలోనే తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు సమానమయ్యాయి. ఢిల్లీలో అయితే డీజిల్ ధర పెట్రోల్ ను కూడా దాటిపోవడం కలకలం రేపుతోంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్ధితి కొనసాగబోతోందన్న సంకేతాలు మధ్యతరగతి ప్రజల్లో ఆందోళన రేపుతున్నాయి.
లాక్ డౌన్ నిబంధనలు సడలించాక దేశవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతుండగా.. ఢిల్లీలో అంతకు మించిన విచిత్రమైన పరిస్ధితి కనిపిస్తోంది. దేశ రాజధానిలో పెరిగిపోతున్న డీజిల్ వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా అక్కడి కేజ్రివాల్ ప్రభుత్వం డీజిల్ పై స్ధానిక పన్నులను పెంచుకుంటూ పోతోంది. దీంతో అక్కడ డీజిల్ ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. గత 19 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 10 రూపాయల మేర పెరిగిపోయాయి. అదే సమయంలో డీజిల్ ధర రికార్డు స్ధాయిలో పెట్రోల్ ను కూడా దాటిపోయి లీటరుకు రూ. 79.88గా నమోదైంది. ఇది పెట్రోల్ ధరను డీజిల్ ధర దాటిపోవడం దేశ చరిత్రలోనే తొలిసారి.
వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా చూసినా ఏ దేశంలోనూ పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర అదికంగా లేదు. భారత్ లో మాత్రం తొలిసారిగా డీజిల్, పెట్రోల్ ధరలు కొన్నేళ్లుగా దాదాపు దగ్గరగా ఉన్నాయి. తాజాగా లాక్ డౌన్ ప్రభావం నేపథ్యంలో అవి కాస్తా పెట్రోల్ ను మించిపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీలో మాత్రమే డీజిల్ ధర పెట్రోల్ ను దాటగా..ఇతర మెట్రో నగరాలైన హైదరాబాద్, కోల్ కతా, చెన్నై, ముంబై తదితర ప్రాంతాల్లో మాత్రం ఈ పరిస్థితి ఇంకా రాలేదు.