చూసిందే రాశాను, అది కూడా ఖైదీల నుంచి విన్నదే: శశికళ రాజభోగాలపై రూప
రూపం మాత్రం జైల్లో తానేం చూశానో అదే రిపోర్టులోను పొందుపరిచానని స్పష్టం చేశారు.
బెంగళూరు: నిన్న మొన్నటి దాకా వార్తల్లో లేని శశికళ పేరు మరోసారి హాట్ టాపిక్గా మారింది. జైల్లోను ఆమె రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ జైళ్ల శాఖ డీఐజీ రూపా ముద్గల్ లేఖ రాయడం వివాదాస్పదమవుతోంది. అడిషనల్ డీజీపీ సత్యనారాయణ లేఖలోని ఆరోపణలను ఖండించడం విషయాన్ని మరింత వివాదాస్పదం చేసింది.
శశికళకు జైల్లోనే రాజభోగాలు: అధికారులకు భారీ మొత్తంలో లంచం!
తాను లేఖలో పేర్కొన్న అంశాలను డీజీపీ ఖండించడం పట్ల రూపా ముద్గల్ స్పందించారు. జైల్లో తానేం చూశానో అదే రిపోర్టులోను అవే పొందుపరిచామని స్పష్టం చేశారు. తన లేఖ పట్ల డీజీపీ ఎందుకలా స్పందించారో తనకు తెలియదని అన్నారు.
శశికళకు ప్రత్యేక సౌకర్యాలు సమకూర్చేందుకు రూ.2కోట్లు చేతులు మారాయని జైలు ఖైదీలే మాట్లాడుకుంటున్నారని, ఇది తాను చెబుతున్నది కాదని పేర్కొన్నారు. తన లేఖలో పేర్కొన్న అంశాలపై చర్యలు తీసుకోవడం తీసుకోకపోవడం అధికారుల చేతుల్లోనే ఉందని తెలిపారు.