13వేల కోట్లకు చేరనున్న డిజిటల్ యాడ్ మార్కెట్: అసోచామ్ సర్వే..
అసోచామ్ సర్వే ప్రకారం డిసెంబర్ 2018 నాటికి డిజిటల్ ప్రకటనలపై ఖర్చు పెట్టే మొత్తం రూ.13వేల కోట్లకు చేరుతుందని తేలింది.
న్యూఢిల్లీ: డిజిటల్ యాడ్ మార్కెట్ రంగం భవిష్యత్తులో మరింత విస్తరించనుంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం.. డేటా ఛార్జీలు కస్టమర్లకు అందుబాటు ధరలోకి రావడంతో ఈ రంగం మరింత విస్తరించడానికి దోహదపడనున్నాయి.
అసోచామ్ సర్వే ప్రకారం డిసెంబర్ 2018 నాటికి డిజిటల్ ప్రకటనలపై ఖర్చు పెట్టే మొత్తం రూ.13వేల కోట్లకు చేరుతుందని తేలింది. తద్వారా 35శాతం వృద్ధిరేటు నమోదవుతుందని తెలిపింది. ప్రస్తుతం డిజిటల్ యాడ్స్ కోసం రూ.9800కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొంది. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్ల వినియోగం పెరుగుతుండటం డిజిటల్ యాడ్స్ రంగానికి ప్రధానంగా ఊతమిస్తోంది.
వచ్చే ఏడాది చివరినాటికి డిజిటల్ యాడ్స్ మార్కెట్ సగటున 50శాతం వృద్ధిని సాధిస్తుందని సర్వేలో వెల్లడైంది. ఇ-కామర్స్, టెలికాం, టెక్నాలజీ, బ్యాంకింగ్, ఆర్థికసేవలు, ఇన్సూరెన్స్ కంపెనీలు వీటిపై భారీగా ఖర్చు చేయనున్నట్టు స్పష్టమైంది.