సీబీఎస్ఈ కొత్త ఆయుధం: ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా కొత్త సాఫ్ట్వేర్ రూపొందించిన మైక్రోసాఫ్ట్
Recommended Video
10వ తరగతి గణితం పరీక్షా పత్రం, 12వ తరగతి ఎకనామిక్స్ పేపర్లు లీక్ కావడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ పై విమర్శలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. దీంతో భవిష్యత్తులో పరీక్ష పేపర్లు లీక్ కాకుండా నియంత్రించేందుకు సీబీఎస్ఈ టెక్ జైంట్ మైక్రోసాఫ్ట్తో జతకట్టింది. ఈఏడాది జరిగిన బోర్డు ఎగ్జామ్ పేపర్స్ లీక్ కావడంతో అటు విద్యార్థులు ఇటు వారి తల్లిదండ్రులు బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మైక్రోసాఫ్ట్ అత్యంత భద్రత కలిగిన డిజిటల్ క్వశ్చన్ పేపర్స్ను మూడు నెలల కాలంలోనే తయారు చేసి పేపర్ లీక్ సమస్యకు చెక్ పెట్టింది.
పరీక్ష ప్రారంభం అయ్యేవరకు...లేదా అరగంట ముందు వరకు క్వశ్చన్ పేపర్ సమాచారం బయటకు పొక్కదని... ఆ విధంగా సీబీఎస్ఈ కోసం ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించినట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ భన్సాలీ తెలిపారు. అయితే ఆ అరగంటలోపే క్వశ్చన్ పేపర్ లీక్ అయితే అది ఎలా లీకైందో, ఎక్కడ లీకైందో సాఫ్ట్వేర్ ద్వారా ఇట్టే తెలిసిపోతుందన్నారు. ప్రశ్నాపత్రాలపై ఒక్కో వాటర్ మార్క్ ఉంటుందని....దీనివల్ల దొంగ సులభంగా దొరికిపోతారని భన్సాలీ స్పష్టం చేశారు. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన ప్రయోగాలు నిర్వహిస్తున్నామని చెప్పిన భన్సాలీ... ఈ సాఫ్ట్వేర్ అన్ని పరీక్షలు పాస్ అయ్యిందని చెప్పారు. ఇదిలా ఉంటే జూలైలో 10వ తరగతి కంపార్ట్మెంటల్ పరీక్షలకు 487 సెంటర్లలో సాఫ్ట్వేర్ను పరీక్షించి సక్సెస్ సాధించినట్లు భన్సాలీ చెప్పారు.
మైక్రోసాఫ్ట్ రూపొందించిన కొత్త సాఫ్ట్వేర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధీనంలో ఉంటుంది. అది విండోస్ 10 ఆఫీస్ 365పై పనిచేస్తుంది. పరీక్ష పేపర్ను డౌన్లోడ్ చేసే ముందు ఎగ్జామినర్లను సిస్టం గుర్తిస్తుంది. అలా గుర్తింపు పొందిన వారే పరీక్ష పత్రాన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఓటీపీ ద్వారా లేదా బైయోమెట్రిక్ ద్వారా ముందు ధృవీకరించాల్సి ఉంటుందని భన్సాలీ వివరించారు. ఒక్కో సెంటర్లో పరీక్ష పేపర్లపై ఒక్కో వాటర్ మార్క్ ఉంటుందని... ఒకవేళ లీక్ అయినా ఈ కోడ్ ద్వారా ఇట్టే పసిగట్టేయొచ్చని భన్సాలీ వివరించారు.
మైక్రోసాఫ్ట్ కొత్తగా రూపొందించిన సాఫ్ట్ వేర్తో పరీక్షపత్రాలు లీక్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ.అంతేకాదు ఈ కొత్త వ్యవస్థతో చాలా సమయంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని భన్సాలీ తెలిపారు. ఇది ఒక్క సీబీఎస్ఈకి మాత్రమే పరిమితం కాకూడదన్న భన్సాలీ ఇతర బోర్డులు కూడా ఇదే పద్ధతిని పాటిస్తే ప్రశ్నాపత్రాల లీకుల నుంచి గట్టెక్కొచ్చని భన్సాలీ తెలిపారు.