టూల్కిట్ ప్లాన్ జరిగిందిలా..ఆరోజే మీటింగ్.. దేశంలో 'డిజిటల్ స్ట్రైక్'కి కుట్ర..: ఢిల్లీ పోలీసులు
'టూల్కిట్...' గత రెండు,మూడు రోజులుగా దేశంలో ఈ పేరు మారుమోగుతోంది. రైతు ఉద్యమంతో ముడిపడివున్న ఈ టూల్కిట్ వ్యవహారంలో దేశ వ్యతిరేక కుట్రలు జరిగాయని కేంద్రం ఆరోపిస్తోంది. రైతు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఒక రోడ్ మ్యాప్లా 'టూల్కిట్'ను రూపొందించారని... విదేశీ శక్తులను కూడా ఇందులోకి తీసుకొచ్చే కుట్ర జరిగిందని ఆరోపిస్తోంది. దేశాన్ని ముక్కలు చేయాలన్న దురుద్దేశంతో తుక్డే తుక్డే గ్యాంగ్ దీన్ని అమలుచేసేందుకు ప్రయత్నించిందని వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే పర్యావరణ కార్యకర్త దిశా రవి అరెస్ట్,న్యాయవాది నికితా జాకోబ్,యాక్టివిస్ట్ శాంతనులకు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జరిగాయి.
డిజిటల్ స్ట్రైక్ కుట్ర : ఢిల్లీ పోలీస్
జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడం వెనుక భారత్పై 'డిజిటల్ స్ట్రైక్' కుట్ర దాగుందని పోలీసులు వెల్లడించారు. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు టూల్కిట్ను రూపొందించారని పేర్కొన్నారు. దీని ద్వారా జనాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయాలనుకున్నారని చెప్పారు. జనవరి 26 నాడు జరిగిన పరిణామాలకు మూలం టూల్కిట్యే అని... అందులో పేర్కొన్న విధంగానే అంతా జరిగిందని తెలిపారు.
జనవరి 11న ప్లాన్...
ఖలీస్తానీ ఉద్యమానికి అనుకూలంగా ఉన్న పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ ఈ టూల్కిట్ను రూపొందించిందని పోలీసులు తెలిపారు. జనవరి 26 నాటి ప్లాన్ను రూపొందించేందుకు జనవరి 11న పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ జూమ్ సమావేశం జరిగిందన్నారు. నికితా జాకోబ్,శాంతను ఇద్దరూ ఈ సమావేశంలో పాల్గొన్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 4న ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని... ఈ నేపథ్యంలో నికితా జాకోబ్ ఇంట్లో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
నికితా ఇంట్లో సోదాలు...
నికితా జాకోబ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నింటినీ స్కాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. టూల్కిట్లో పేర్కొన్న ఈమెయిల్ శాంతనుకి చెందినదిగా గుర్తించామన్నారు. దిశా రవి,నికితా,శాంతను... ఈ ముగ్గురూ కలిసి టూల్కిట్ను ఎడిట్ చేసినట్లుగా గుర్తించామన్నారు. ఆపై దిశా రవి దీన్ని టెలీగ్రామ్ ద్వారా ప్రపంచ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్కు షేర్ చేశారని చెప్పారు. అదే సమయంలో దాన్ని వ్యాప్తి చేయడానికి క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ను దిశా రవి డిలీట్ చేశారని తెలిపారు. వాట్సాప్ మాత్రమే కాదు... మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలను కూడా ఆమె డిలీట్ చేసినట్లు చెప్పారు.
సోషల్ మీడియాలో వ్యాప్తికి పీటర్ ఫ్రెడరిక్
సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ టూల్కిట్ను వ్యాప్తిలోకి తీసుకొచ్చేందుకు ముందుకొచ్చారని పోలీసులు చెప్పారు. టూల్కిట్ వ్యాప్తికి హాష్ ట్యాగ్స్ను రూపొందించడంలో పీటర్ ఫ్రెడరిక్ కీలకంగా వ్వవహరించినట్లు తెలిపారు. అయితే దిశా,నికితాలతో ఫ్రెడరిక్ డైరెక్ట్గా టచ్లో ఉన్నాడా లేదా అన్నది విచారణలో తేలాల్సి ఉందన్నారు. ఈ టూల్కిట్లో గూగుల్ డాక్యుమెంట్స్ను పొందుపరిచిన కొన్ని హైపర్ లింక్స్ ఉన్నాయని... ఇందులో చాలావరకూ ఖలీస్తానీ ఉద్యమానికి సంబంధించివే ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. నిజానికి ఇది ప్రైవేట్ డాక్యుమెంట్ అని... అనుకోకుండా బయటకు లీక్ అయిందన్నారు.