విద్యా వ్యవస్థలో డిజిటలైజేషన్ సాధ్యమేనా ? ఆన్ లైన్ బోధన గ్రామాల్లో వర్కవుట్ అవుతుందా ?
కరోనా వైరస్ మానవ జీవన విధానాన్నే మార్చేసింది . ఇక విద్యా వ్యవస్థలోనూ సమూల మార్పులు తెస్తుంది . డిజిటల్ తరగతుల దిశగా సర్కార్ ఆలోచన సాగించేలా చేస్తుంది . అయితే ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినా అది ఆచరణ సాధ్యమా ? ఇంకా చాలా గ్రామాలు వెనుకబడి ఉన్న భారతదేశంలో డిజిటల్ విద్యా విధానం ప్రయోజనకరంగా ఉంటుందా ? దీనికి సంబంధించి ప్రతికూలతలు ఏంటి ? వన్ ఇండియా ప్రత్యేక కథనంలో
corona update : ఇండియాలో లక్ష దాటిన కేసులు... ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షలకు చేరువలో
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాల్లో డిజిటల్ విద్యా విధానం సాధ్యమా ?
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటంలో భాగంగా ఇండియాలో విధించిన లాక్ డౌన్ తో విద్యార్థులు అకడమిక్ క్యాలెండర్ పూర్తిగా మారిపోయింది. కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ బంద్ అయ్యాయి .పిల్లలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక ఈ నేపధ్యంలో రానున్న విద్యా సంవత్సరానికి విద్యా విధానంలో పెను మార్పుల దిశగా ఆలోచిస్తున్న కేంద్ర సర్కార్ కరోనా కట్టడి కోసం తీసుకునే నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుందా ? డిజిటల్ విద్యా విధానాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్న తరుణంలో ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలలో డిజిటల్ విద్యా విధానం అమలు సాధ్యమేనా అంటే కాదు అన్న అభిప్రాయమే వ్యక్తం అవుతుంది.
వారానికి మూడు రోజులు స్కూల్స్ , మూడు రోజులు డిజిటల్ తరగతులు
లాక్ డౌన్ సడలించి స్కూళ్ళు, కాలేజీలు కొనసాగించటానికి ఒక విధానం అనుసరించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం డిజిటల్ విద్యా విధానం తెరమీదకు తీసుకు రానుంది . అయితే రెగ్యులర్ గా కాకుండా ఆల్టర్నేట్ డేస్ లో స్కూల్స్ నిర్వహించి స్కూల్ లేని రోజుల్లో డిజిటల్ ద్వారా బోధన సాగించే అంశం పరిశీలిస్తున్న సర్కార్ ముందు ఒక సవాల్ ఉంది. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు ఇంకా వెనుకబాటు తనంలోనే ఉన్నాయి . ఇక ఈ నేపధ్యంలో అక్కడ డిజిటల్ విద్యా విధానం అమలు సాధ్యం కాదనే భావన వ్యక్తం అవుతుంది.
ఆన్ లైన్ విద్యా విధానం విద్యార్ధి ఉన్నతికి దోహదం చెయ్యదనే భావన
ఇక అంతేకాదు ఆన్ లైన్ విద్యావిధానం విద్యార్థులను ఒంటరి వాళ్ళను చేస్తుంది. వారిలో సృజనాత్మకత బయటకు రాకుండా చేస్తుంది . ఉపాధ్యాయులకు విద్యార్ధి ఎలా ఉన్నాడో ఏ సబ్జెక్ట్ వీక్ ఉన్నాడో తెలుసుకునే అవకాశం ఉండదు . ఇక పిల్లల్లో ఆన్ లైన్ విద్యా విధానం ద్వారా మానసిక ఒత్తిడి పెరుగుతుంది . ఈ ధోరణి యునెస్కో మరియు యునిసెఫ్లోని విద్యా నిపుణులతో సహా చాలా మందిలో ఆందోళనలను రేకెత్తించింది. అందరితో సమిష్టిగా ఉండటం , క్రమశిక్షణ పాటించటం , సమయ పాలన చెయ్యటం వంటివి స్కూల్ లో సాధ్యమైనంతగా ఆన్ లైన్ లో సాధ్యం కాదు . ఇక కేంద్రం మాత్రం కరోనా ప్రబలకుండా ఉండటం కోసం ఆన్ లైన్ విద్యా విధానాన్ని అమలు చెయ్యాలని భావిస్తుంది .
పట్టణ విద్యార్థులతో పోటీ పడలేని గ్రామీణ విద్యార్థులు
అందులో భాగంగా స్వయంప్రభ పేరుతో 1 నుంచి 12వ తరగతి వరకు ఒక్కో తరగతికి ఒక్కో చానల్ చొప్పున 12 చానళ్లు ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ఇందులో ప్రసారం చేసే సిలబస్, ఇతర విధానాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది . ఆన్లైన్ విద్య పట్టణాలలో ఉన్న విద్యార్థులకు ఈజీగా ఉంటుంది కానీ గ్రామీణ ప్రాతాల విద్యార్థులకు కష్టంగా ఉంటుంది. దీంతో గ్రామీణ విద్యార్థుల ఆత్మస్థైర్యం దెబ్బ తీస్తుంది. వారిలో ఉన్న నైపుణ్యం ఆన్ లైన్ విద్యా బోధన బయటకు తీయలేదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల వల్ల, టెక్నాలజిని అధికంగా వినియోగిస్తున్న పట్టణ ప్రాంత విద్యార్థులతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ పడలేరు.
గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ తరగతులకు మౌలిక వసతులు కల్పించకుంటే కష్టమే
పోటీని తట్టుకోలేక కొందరు, ఆన్ లైన్ విద్యా విధానం అర్ధం కాక కొందరు చదువును మధ్యలోనే వదిలివేసే అవకాశం ఉంది. ఇక అన్ని గ్రామాల్లో డిజిటల్ విద్యా బోధన కోసం కావాల్సిన మౌలిక వసతుల కల్పన చెయ్యకుండా ఈ విద్యా విధానాన్ని ప్రారంభిస్తే గ్రామాలలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు . కాబట్టి కేంద్ర సర్కార్ కరోనా కట్టడి కోసం విద్యా విధానంలో మార్పు చెయ్యాలని తీసుకున్న నిర్ణయం విషయం అటుంచి డిజిటల్ విద్యా విధానం అమలు చెయ్యాలని భావిస్తే మాత్రం గ్రామీణ ప్రాంతాలలోని సాధ్యాసాధ్యాల గురించి సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది .