ఆర్టికల్ 370 పై డిగ్గీ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పాకిస్తాన్ కోసం పనిచేస్తోందన్న బీజేపీ
ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్కు రాష్ట్రహోదా తొలగింపు అంశాలపై తమ పార్టీ అధికారంలోకి వస్తే... మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునఃసమీక్షిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.ఈ వ్యాఖ్యలను ఒక క్లబ్హౌజ్లో దిగ్విజయ్ సింగ్ చేశారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. పాకిస్తాన్తో దిగ్విజయ్ ఒప్పందం చేసుకున్నారు కనకే ఈ వ్యాఖ్యలు చేశారని అది కూడా భారత దేశంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని బీజేపీ మండిపడింది.
పాకిస్తాన్కు చెందిన ఒక జర్నలిస్టుతో దిగ్విజయ్ సింగ్ పైవ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు స్పందించాలని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు అంశం, జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా తొలగింపుపై తమ ప్రభుత్వం పునఃసమీక్షిస్తుందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ఈ కాంగ్రెస్ నేత చిక్కుల్లో పడ్డారు. మోడీ ప్రభుత్వం అధికారం కోల్పోగానే ఆ తర్వాత జరిగే పరిణామాలపై స్పందిస్తున్న క్రమంలో దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై దుమ్మెత్తి పోసింది బీజేపీ. అయితే బీజేపీకి కూడా ధీటుగా సమాధానం ఇచ్చారు డిగ్గీరాజా. హిందీలో ఓ ట్వీట్ చేశారు. "నిరక్షరాస్యులైన ఈ సమూహంకు తప్పక మరియు పరిగణించాలి అనే పదాలకు తేడా తెలియడం లేదు." అని ట్వీట్ చేశారు దిగ్విజయ్ సింగ్. అయితే ఈ ట్వీట్ పై సంబిత్ పాత్ర స్పందించారు. దిగ్విజయ్ దేశంపై ఎలా విషం చిమ్ముతున్నారో అంతా చూశామని అన్నారు. పాకిస్తాన్తో ఒప్పందం మేరకే ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పల్వామా దాడులు అదే సమయంలో 26/11 ముంబై దాడుల వెనక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని కూడా ఈ పెద్దమనిషే చెప్పారని సంబిత్ పాత్ర గుర్తుచేశారు.
రాహుల్ గాంధీతో సహా ఇతర కాంగ్రెస్ నేతలైన మణిశంకర్ అయ్యర్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా సంబిత్ పాత్ర గుర్తుచేశారు. పాకిస్తాన్తో కాంగ్రెస్ నేతలు కలిసి పనిచేస్తుందని చెప్పేందుకు తాజా వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.మోడీ, భారత్పై విషం చిమ్మేందుకు భవిష్యత్తులో కాంగ్రెస్ చైనా పాకిస్తాన్తో కూడా జతకడుతుందని మండిపడ్డారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి యాంటీ నేషనల్ క్లబ్హౌజ్గా పార్టీ పేరును కాంగ్రెస్ మార్చుకుంటే బాగుంటుందని సందీప్ పాత్ర సెటైర్లు వేశారు.ఈ క్లబ్హౌజ్లో భారత్ను ద్వేషించేవారితో పాటు మోడీపై విషం చిమ్మేవారే ఈ క్లబ్హౌజ్లో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ అంశంపై మాట్లాడాలని స్పష్టత ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది.