ఓటు వేయలేకపోయిన దిగ్విజయ్ సింగ్
భోపాల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్.. తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. సకాలంలో పోలింగ్ కేంద్రానికి చేరుకోలేకపోవడం వల్ల ఓటు వేయలేకపోయినట్లు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. రాజ్ఘర్ ఓటర్ల జాబితాలో దిగ్విజయ్ సింగ్ పేరు ఉంది. అది ఆయన స్వస్థలం. భోపాల్ నుంచి సుమారు 130 కిలోమీటర్ల దూరంల ఉంటుందీ రాజ్ఘర్. సాయంత్రం వరకూ దిగ్విజయ్ సింగ్ పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తూ భోపాల్లోనే ఉండిపోయారని, సాయంత్రం రాజ్ఘర్కు బయలుదేరినప్పటికీ.. సకాలంలో పోలింగ్ కేంద్రానికి చేరుకోలేకపోయారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఆరో విడత ముగిసిన లోక్సభ ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. భోపాల్ లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన బరిలో నిల్చున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా భారతీయ జనతాపార్టీ సాధ్వీ ప్రగ్యాసింగ్ను నిలిపింది. పోలింగ్ రోజు దిగ్విజయ్ సింగ్ భోపాల్లో గడిపారు. జయాపజయాలు ఎలా ఉన్నాయంటూ ఆరా తీస్తూ గడిపారు.
జెండా ఏదైతేనేం పోస్ట్ చేశామా...లేదా అన్నదే పాయింట్...సరికొత్త వివాదంలో రాబర్ట్ వాద్రా
పోలింగ్ సరళని స్వయంగా పర్యవేక్షిస్తూ భోపాల్ను దాటి బయటికి వెళ్లలేకపోయారు. ఫలితంగా- రాజ్ఘర్ వెళ్లలేకపోయారని పార్టీ నాయకులు అంటున్నారు. ట్విస్ట్ ఏమిటంటే- పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఆయన దగ్గరుండి ప్రయత్నాలు చేశారు. వృద్ధులు, మహిళా ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక రవాణా సాధనాలను ఏర్పాటు చేశారు గానీ.. తన ఓటు తాను వేసుకోలేకపోయారు.
ఓటు వేయలేకపోవడం పట్ల దిగ్విజయ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేయలేకపోయినందుకు క్షమించాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల నాటికి తన ఓటును రాజ్ఘర్ నుంచి భోపాల్కు మార్చుకుంటానని డిగ్గీరాజా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయివుండీ, స్వయంగా పోటీ చేస్తూ, తన ఓటు హక్కును తాను వినియోగించుకోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై విమర్శల దాడికి దిగారు. ఇలాంటి వారిని పెట్టుకుని రాహుల్ గాంధీ ఏం సాధిస్తారంటూ ఎద్దేవా చేస్తున్నారు.