నేను ప్రచారం చేస్తే పార్టీ ఓడిపోతుంది: దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
భోపాల్: ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. దిగ్విజయ్ కూడా పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
ప్రచారంలో తాను పాల్గొంటే, మాట్లాడితే కాంగ్రెస్ ఓడిపోతుందని, పార్టీ నుంచి ఎవరు టిక్కెట్లు పొందినా వారు తప్పకుండా గెలుస్తారని, కానీ అందుకు నేను ఓ పని చేయాల్సి ఉంటుందని, ఏ కార్యక్రమంలోనూ తాను పాల్గొనకూడదని, పార్టీ తరఫున తాను ప్రచారం చేయవద్దని, ఎందుకంటే తన ప్రసంగాల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడవన్నారు.
కాగా, దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే విషయంపై స్పష్టత లేదు. ఆయన వ్యంగ్యంగా ఈ వ్యాఖ్యలు చేశారా, పార్టీపై అసంతృప్తితో చేశారా తేలాల్సి ఉంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కమల్ నాథ్ స్పందించారు. ఎందుకు అలా మాట్లాడారో తెలియదన్నారు.