కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగ్విజయ్ సింగ్-గెహ్లాట్ సస్పెన్స్ నేపథ్యంలో ప్రాధాన్యం..
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. నిన్న మొన్నటివరకూ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్, శశిథరూర్ మధ్య పోటీ ఉంటుందని, ఇందులోనూ అధిష్టానం ఆశీస్సులున్న గెహ్లాట్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమేనని అంతా భావించారు. కానీ రాజస్తాన్ లో అధికారం వదులుకునేందుకు ఆయన ససేమిరా అనడంతో సీన్ మొత్తం మారిపోయింది. రాజస్ధాన్ లో తన వారసుడిని తానే ఎంచుకునేందుకు సిద్ధం కావడం, అందుకు అధిష్టానం ఒప్పుకోకపోవడంతో తిరుగుబాటుకు ప్రయత్నించడంతో గెహ్లాట్ ఒంటరి అయ్యారు. అదే సమయంలో అధ్యక్ష ఎన్నికల రేసులోనూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న అశోక్ గెహ్లాట్ ను అధిష్టానం తప్పుకోమని కోరుతుందని అంతా భావించినా అలా జరగలేదు. అదే సమయంలో ఆయనకు పోటీగా మరికొందరిని అధిష్టానం నిలబెట్టే అవకాశం ఉందని భావించారు. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది. అధ్యక్ష ఎన్నికల రేసులో గెహ్లాట్ ను కొనసాగిస్తూనే ఆయనకు పోటీగా మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను అధిష్టానం బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు డిగ్గీ రాజా సిద్ధమయ్యారు. ఎల్లుండి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు.
రాజస్తాన్ కాంగ్రెస్ లో తిరుగుబాటు నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తరఫున ముగ్గురు రేసులో నిలబడేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో దిగ్విజయ్ సింగ్ ఒకరు కాగా.. సీనియర్లు మల్లిఖార్జునఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా ఇందులో ఉన్నారు. అయితే వీరి పోటీపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ వీరు పోటీలో నిలవకపోతే అప్పుడు గెహ్లాట్, దిగ్విజయ్, శశిథరూర్ మాత్రమే రేసులో మిగులుతారు. అప్పుడు అధిష్టానం మద్దతు దిగ్విజయ్ కు లభించవచ్చని భావిస్తున్నారు.