నితీశ్ తేజస్వికి మద్దతునివ్వాలి... జాతీయ రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని కాపాడాలి : దిగ్విజయ్
బిహార్ ముఖ్యమంత్రి,జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీజేపీ నేత్రుత్వంలోని ఎన్డీయేని వీడి మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్కు మద్దతునివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. బిహార్లో వ్యూహాత్మకంగా నితీశ్ స్థాయిని తగ్గించిన బీజేపీని ఇకనైనా ఆయన వదిలిపెట్టాలన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన వరుస ట్వీట్లు చేశారు.
'బీజేపీ ఒక తీగ లాంటిది. అది మరో చెట్టు సాయం తీసుకుని పైకి ఎగబాకుతుంది. ఆ చెట్టు ఎండిపోతున్నా సరే... అది పైకి ఎగబాకుతూనే ఉంటుంది. నితీశ్ జీ.. గత ఎన్నికల్లో మీరూ,లాలూ కలిసి పోటీ చేశారు. ఇప్పుడు లాలూ జైల్లో ఉన్నారు. ఇకనైనా బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలన్ని వదిలి తేజస్వికి మద్దతునివ్వండి. బిహార్లో బీజేపీ లాంటి తీగలను పెరగనివ్వకండి..' అని దిగ్విజయ్ పేర్కొన్నారు.
'నితీశ్ జీ... మీకు బిహార్ పాలిటిక్స్ చిన్నవైపోయాయి. మీరు తప్పనిసరిగా జాతీయ రాజకీయాల్లోకి రావాలి. కేంద్రం విభజించు పాలించు రాజకీయాలకు మీరు మద్దతునివ్వకండి. లౌకికవాద భావజాలాన్ని నమ్మే సోషలిస్టులతో కలిసి నడవండి.' అని దిగ్విజయ్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. బీజేపీ,ఆర్ఎస్ఎస్లను వీడి దేశం నాశనమవకుండా కాపాడాలని నితీశ్కు దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు.
కాగా,బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేత్రుత్వంలోని ఎన్డీయే 125 స్థానాల్లో నెగ్గిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ నేత్రుత్వంలోని మహాకూటమి 110 స్థానాలకే పరిమితమైంది. అయితే గతంతో పోల్చితే మహాకూటమి ఓటు బ్యాంకు పెరిగింది. చాలా చోట్ల ఎన్డీయే అభ్యర్థులు కేవలం వెయ్యి లోపు మార్జిన్తో మహాకూటమి అభ్యర్థులపై గెలుపొందారు. దీంతో ఆర్జేడీ కౌంటింగ్ ప్రక్రియపై అనుమానాలను వ్యక్తం చేస్తోంది. అయితే ఈసీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. కౌంటింగ్ చాలా ప్రశాంతంగా, పారదర్శకంగా సాగిందని ప్రకటించింది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపుపై అనుమానాలకు తాము చాలా సార్లు వివరణలు ఇచ్చామని... ఈ విషయాన్ని పదే పదే అడగాల్సిన అవసరం లేదని ఈసీ నొక్కి చెప్పింది.