ఆవు పాలల్లో బంగారం ఉంది.. నా గోవులను తీసుకుని రుణం ఇవ్వండి
పశ్చిమ బెంగాల్ : రెండురోజుల క్రితం పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ భారతీయ గోవులు ఇచ్చే పాలల్లో బంగారం ఉంటుందనే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త దావనంలో పాకడంతో గోవులు ఇచ్చే పాలల్లో బంగారం ఉంటుందని నిజంగానే భావించిన ఓ వ్యక్తి మనప్పురం ఫైనాన్స్ వద్దకు గోవులను తీసుకుని వెళ్లి లోన్ ఇవ్వాల్సిందిగా కోరాడు. ఈ ఘటన బెంగాల్లోని డంకుని ప్రాంతంలో చోటుచేసుకుంది.
భారత్లో పుట్టి పెరిగిన గోవులు ఇచ్చే పాలల్లో బంగారం ఉంటుందని విని తాను తన గోవులను తాకట్టు పెట్టి రుణం పొందేందుకు వచ్చినట్లు చెప్పాడు. తమ కుటుంబం ఈ ఆవులపైనే ఆధారపడి జీవిస్తోందని చెప్పిన వ్యక్తి ఇలాంటి ఆవులు తన వద్ద 20 వరకు ఉన్నాయని చెప్పాడు. ఈ ఆవులను పెట్టుకుని రుణం ఇస్తే తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించాడు. దిలీప్ ఘోష్ వ్యాఖ్యలతో తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చాలామంది గ్రామస్తులు ప్రతిరోజు తమ వద్దకు గోవులను తీసుకొచ్చి వాటిపై ఎంత రుణం వస్తుందని అడుగుతున్నారని గరాల్గచ్చా గ్రామ పంచాయత్ ప్రధాన్ మనోజ్సింగ్ చెప్పారు.
గోవు ఇచ్చే పాలల్లో బంగారం ఉందని చెప్పిన దిలీప్ ఘోష్ను నోబెల్ బహుమానంతో సత్కరించాలని ఎద్దేవా చేశారు మనోజ్ సింగ్. రోజుకు 15 నుంచి 16 లీటర్ల పాలు తమ గోవులు ఇస్తాయని వీటిపై తమకు రుణం ఎంత వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు తనను అడుగుతున్నారని చెప్పారు. ఇదంతా విన్న తర్వాత చాలా సిగ్గుగా ఉందని చెప్పారు. ఓ రాజకీయ నాయకుడు కూడు, గూడు, బట్ట గురించి మాట్లాడాలి తప్పితే ఇలాంటి పనికిరాని మాటలు కాదని అన్నారు. ముఖ్యమైన సమస్యలపై మాట్లాడాల్సిందిపోయి, మతం హిందూత్వం గురించి మాట్లాడటం సిగ్గుచేటని మనోజ్సింగ్ అన్నారు.
ఇదిలా ఉంటే బురుద్వాన్ జిల్లాలో మాట్లాడిన దిలీప్ ఘోష్ భారత్లో పుట్టి పెరిగిన ఆవులకు వెనక ఒక మూపురం ఉంటుందని అందులో బంగారం దాగి ఉంటుందని చెప్పారు. సూర్యకిరణాలు దానిపై పడటం వల్లే ఆ గోవు ఇచ్చే పాలు బంగారం రంగులోకి లేదా పసుపు రంగులోకి మారుతాయని చెప్పారు. అదే మూపురం విదేశాల్లో ఉన్న గోవుల్లో కనిపించదని చెప్పారు. పసుపు రంగులో మారిన ఈ పాలకు అనేక ఔషధ గుణాలున్నాయని చెప్పారు.