మోడీనే పెళ్లి చేసుకుంటా: నెలరోజులుగా ఓ మహిళ నిరాహార దీక్ష
తాను వివాహం చేసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీనే చేసుకుంటానంటూ ఓ మహిళ భీష్టించుకు కూర్చుంది. అదెక్కడో కాదు ఏకంగా దేశ రాజధానిలోనే కావడం గమనార్హం. అంతేగాక, తనను మోడీ ఆహ్వానిస్తారని నమ్మకం చెబుతోంది.
న్యూఢిల్లీ: తాను వివాహం చేసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీనే చేసుకుంటానంటూ ఓ మహిళ భీష్టించుకు కూర్చుంది. అదెక్కడో కాదు ఏకంగా దేశ రాజధానిలోనే కావడం గమనార్హం. అంతేగాక, తనను మోడీ ఆహ్వానిస్తారని నమ్మకం చెబుతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన జయశాంతి(45) అనే మహిళ గత నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తోంది. ఈ నేపధ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రధాని నరేంద్ర మోడీని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. పైగా తనను మోడీ అర్థం చేసుకుంటారని తెలిపింది.
జయశాంతి తెలిపిన వివరాల ప్రకారం.. జయశాంతికి 1989లో వివాహమైంది. ఆమె భర్త ఒక సంవత్సరం తరువాత ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటోంది. తరువాత ఆమెను వివాహం చేసుకునేందుకు చాలామంది ముందుకువచ్చినా ఆమె నిరాకరించింది.
కాగా, తాజాగా ఆమె ప్రధాని మోడీని వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని, ఆయన సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అలాగే తనకున్న ఆస్తులను అమ్మి మోడీకి రెండు కోట్ల రూపాయలను కట్నంగా ఇస్తానని కూడా చెబుతోంది. ఇక్కడి నుంచి తనను పంపిస్తే మోడీ నివాసం ముందు ఆందోళన చేస్తానని చెప్పడం గమనార్హం.
కాగా, మోడీకి చిన్నతనంలోనే యశోదాబెన్ అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది కాలం నుంచే వారు వేరుగా ఉంటున్నారు. యశదా బెన్.. మోడీ సూచన మేరకు బాగా చదువుకుని ప్రభుత్వ టీచర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె గుజరాత్లోని సొంత గ్రామంలోనే ఉంటున్నారు.