దిల్సుఖ్నగర్ పేలుళ్లకు ఏడాది: మృతులకు నివాళి
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలువురు విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఘటనలో అసువుబాసిన మృతులకు నివాళులర్పించిన అనంతరం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. మరోసారి ఇలాంటి దుర్ఘటన జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉగ్రవాదానికి కులం, మతం, ప్రాంతం, భాషలతో సంబంధం లేదని, దేశంలో అరాచకం సృష్టించడమే వారి లక్ష్యమని ఆయన అన్నారు. ఆయనతోపాటు బిజెపి నగర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, పలువురు బిజెపి నాయకులు పాల్గొని నివాళులర్పించారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎల్బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ ఘటనా స్థలానికి చేరుకుని నివాళులర్పించారు.
2013, ఫిబ్రవరి 21న జరిగిన ఈ పేలుళ్లు 18 మందిని పొట్టన పెట్టుకున్నాయి. మరో 138 మదిని గాయాలపాలు చేసి, 76 మంది అవయవాలు లేకుండా చేశాయి. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులకు సంతాపం తెలిపిన ప్రధాని, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. కాగా ఇప్పటికీ కొందరు బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేరనే లేదు. ఘటనా స్థలానికి వచ్చిన బాధితుల కుటుంబ సభ్యులు, ఘటనను తల్చుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.