ఎవరీ దినకరన్, ఇంతకాలం ఎక్కడున్నాడు, కారణమదేనా?
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బతికున్న కాలంలో ఎవరిని దూరంగా పెట్టారో ,ప్రస్తుతం శశికళ వద్ద జయ దూరంగా ఉంచినవారే ఉంటున్నారు. శశికళ మేనల్లుడు దినకరన్ రెండు మాసాలుగా శశికళ వెంటే ఉంటున్నారు.
చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దూరం పెట్టినవారందరిని శశికళ తిరిగి అక్కున చేర్చుకొంటున్నారు.జయ మరణించిన తర్వాత శశికళ చుట్టూ వారంతా చేరుతున్నారు. రెండు మాసాలుగా శశికళ వెంట దినకరన్ ఉండడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్నాడిఎంకె శాసనసభపక్ష నాయకుడిగా శశికళ ఎన్నికైన తర్వాత పన్నీర్ సెల్వం తన పదవికి రాజీనామా చేశారు.
అయితే అన్నాడిఎంకె పార్టీలో ఎంఏల్ఏలు శశికళ, పన్నీర్ సెల్వం మద్దతుదారులుగా చీలిపోయారు. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని రెండు వర్గాలు గవర్నర్ ను కోరాయి.
జయలలిత బతికున్న కాలంలో ఎవరిని దూరంగా ఉంచారో వారంతా ప్రస్తుతం శశికళ చుట్టూ తిరుగుతున్నారు. తాను మినహ కుటుంబసభ్యులంతా జయకు దూరంగానే ఉన్నారు.
ఎవరీ దినకరన్
శశికళ కు స్వయానా మేనల్లుడు టీటీవి దినకరన్. జయలలిత బతికున్న కాలంలో దినకరన్ ను జయ తన ఇంటి నుండి బయటకు పంపారు. శశికళను మినహ ఇతరులెవ్వరినీ కూడ ఆమె తన ఇంటి చాయల్లోకి కూడ రానివ్వలేదు. జయ ఆదేశాలను శశికళ పాటించారు. అందుకే ఆమె శశికళను విశ్వసించారు. అయితే జయ రాసిన లేఖను గురువారం నాడు పన్నీర్ సెల్వం బయటపెట్టారు. ఆ లేఖలో కూడ కుటుంబసభ్యులకు దూరంగా ఉంటానని ఆమె ప్రకటించారు.
శశికళ వెంటే దినకరన్
జయలలిత మరణించిన తర్వాత శశికళ ఇంటికి దినకరన్ రాకపోకలు ప్రారంభమయ్యాయి. రెండు మాసాలుగా దినకరన్ తిరిగి శశికళ వెంటే ఉంటున్నారు.పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో కూడ దినకరన్ కూర్చుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కీలకంగా వ్యవహరిస్తున్న దినకరన్
రెండు మాసాలుగా సాగుతున్న పరిణామాల నేపథ్యంలో శశికళ మేనల్లుడు దినకరన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. శశికళ ఎక్కడకు వెళ్ళినా దినకరన్ ఆమె వెంటే ఉంటున్నారు. పార్టీ సమావేశాలతో పాటుగా గవర్నర్ విద్యాసాగర్ రావును శశికళ కలిసిన సమయంలో కూడ దినకరన్ ఆమెతో పాటు ఉన్నారు. అంతేకాదు పార్టీ సమావేశాల్లో కాని, గవర్నర్ తో సమావేశాల్లో కాని దినకరన్ మాత్రం ఏం మాట్లాడలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జయ ఎందుకు దినకరన్ ను పక్కకు పెట్టారు.
జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే శశికళ కుటుంబ సభ్యులను కొందరిని తన ఇంటి నుండి బయటకు పంపారు. శశికళను కూడ పంపారు. అయితే తన మీద కుట్రపన్నారని జయలలిత వీరందరిని ఆనాడు బయటకు పంపారు.జయ గెంటేసిన వారి జాబితాలో దినకరన్ కూడ ఉన్నారు. జయ బతికున్నకాలంలో ఒక్కరోజు కూడ దినకరన్ కాని, శశికళ కుటుంబసభ్యులు కాని పోయేస్ గార్డెన్ దరిదాపుల్లోకి రాలేదు.