దినకరన్ కు ఏ పార్టీ లేదు: గుర్తు ఇవ్వలేం, కొట్టేయండి, ఢిల్లీ హైకోర్టులో ఎన్నికల కమిషన్!
న్యూఢిల్లీ: ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడులో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే గుర్తుతో పోటీ చేసి ఎడప్పాడి పళనిస్వామి వర్గాన్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్న టీటీవీ దినకరన్, ఆయన వర్గంలోని నాయకులకు భారత ఎన్నికల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. దినకరన్ పిటిషన్ కొట్టి వేయాలని ఢిల్లీ హైకోర్టులో ఎన్నికల కమిషన్ మనవి చేసింది.
కుక్కర్ గుర్తు
తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన టీటీవీ దినకరన్ చెన్నైలోని ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) పేరుతో ప్రెషర్ కుక్కర్ గుర్తు మీద పోటీ చేసి ఘన విజయం సాధించారు.
కుక్కర్ కావాలి
అన్నాడీఎంకే పార్టీ (అమ్మ)కి కుక్కర్ గుర్తు కేటాయించాలని, తమ వర్గీయులు అందరూ అదే గుర్తు మీద పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించాలని, ఈ విషయం భారత ఎన్నికల కమిషన్ కు సూచించాలని టీటీవీ దినకరన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు నోటీసులు
టీటీవీ దినకరన్ పిటిషన్ పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు కౌంటర్ దాఖలు చెయ్యాలని భారత ఎన్నికల కమిషన్, ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం తదితరులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం టీటీవీ దినకరన్ పిటిషన్ విచారణకు వచ్చింది.
ఆ పార్టీ లేదు
అన్నాడీఎంకే (అమ్మ) అనే పార్టీనే లేదని, అలాంటి పార్టీని భారత ఎన్నికల కమిషన్ గుర్తించలేదని, అలాంటి సమయంలో ఓకే గుర్తు కేటాయించడం ఎలా సాధ్యం అవుతుందోని భారత ఎన్నికల కమిషన్ న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో వాదించారు.
పిటిషన్ కొట్టి వేయండి
ఎన్నికలు జరిగే సమయంలో రాష్ట్రంలో ఉన్న ఎన్నికల అధికారులు స్వతంత్రంగా పోటీ చేస్తున్న వారికి గుర్తులు కేటాయిస్తారని, అది మా పరిధిలోకి రాదని, దినకరన్ పిటిషన్ కొట్టి వెయ్యాలని భారత ఎన్నికల కమిషన్ ఢిల్లీ హైకోర్టులో మనవి చేసింది.